1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (11:21 IST)

ఇంట్లో చీరతో కట్టిన ఊయల ఊగుతూ బాలిక మృతి

ఇంట్లో చీరతో కట్టిన ఊయల ఊగుతూ ఓ బాలిక మృతి చెందింది. ఈ ఘటన నాచారంలో గురువారం సాయంత్రం విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే, నాచారంలోని మజీద్‌బాబానగర్‌లో నివాసముంటున్న ఒల్లూరి రమే్‌షకు భార్య, కూతురు మనస్విని (10), ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. రమేష్‌ దంపతులిద్దరూ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. 
 
కొడుకు పుట్టినప్పటి నుంచి మానసిక వ్యాధితో బాధపడుతుండగా, మనస్విని హబ్సిగూడలోని బ్రిలియంట్‌ గ్రామర్‌ స్కూల్‌లో 4వ తరగతి చదువుతోంది. రమేష్‌, అతడి భార్య గురువారం ఉదయం ఉద్యోగానికి వెళ్లగా, అతని తల్లి ఉమారాణి ఇంట్లో ఉంది. ఈమె రెండు రోజుల క్రితం కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకుని విశ్రాంతి తీసుకుంటోంది. మధ్యాహ్నం 3 గంటలకు ఇంటిలో మనస్విని తనకు తానుగా చీరతో ఉయ్యాల కట్టుకుని ఊగుతోంది. 
 
ఈ క్రమంలో ఊయలలో గుండ్రంగా తిరుగుతుండగా ప్రమాదవశాత్తు మెడకు చీర బిగుసుకుని ఊపిరాడక మృతి చెందింది. నిద్రపోతున్న నానమ్మ లేచి చూసేసరికి మనస్విని చనిపోయి కనిపించడంతో గట్టిగా కేకలు వేసింది. గమనించిన చుట్టుపక్కల వారు ఘటనా స్థలానికి చేరుకుని బాలిక మెడ నుంచి చీరను వేరు చేశారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.