బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 అక్టోబరు 2022 (09:54 IST)

5జీ సేవల యాక్టివ్ పేరుతో సైబర్ నేరగాళ్ల దందా

5g service
ఈ నెల ఒకటో తేదీ నుంచి దేశ వ్యాప్తంగా 5జీ టెలికాం సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేట్ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌లు ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించాయి. రిలయన్స్ జియో మూడు నగరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎయిర్ టెల్ మాత్రం దేశంలోని ఏడు నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చింది.
 
అయితే, ఇదే అదునుగా భావించిన సైబర్ నేరగాళ్లు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. 5జీ సేవల యాక్టివేషన్ పేరుతో ఫోన్లను హ్యాక్ చేస్తూ, బ్యాంకు ఖాతాల్లోని డబ్బును కాజేస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన తెలంగాణ పోలీసులు.. ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం ఒక అవగాహన వీడియోను షేర్ చేసింది. 
 
మీ మొబైల్‌ సిమ్ కార్డ్‌లో 5జీ సేవలను యాక్టివేట్ చేశారనే తప్పుడు సాకుతో సైబర్ నేరగాళ్లతో ఓటీపీలను ఎలా షేర్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారో ఈ వీడియోలో వివరించారు. 
 
'5జీ అప్‌గ్రేడేషన్ సిమ్ స్కామ్ పట్ల జాగ్రత్త వహించండి. మీ సిమ్‌లను అప్‌గ్రేడ్ చేస్తామనే సాకుతో మిమ్మల్ని మోసగించే సైబర్ మోసగాళ్ల బారిన పడకండి. మనీ పర్స్ వీడియో ప్రకారం, సైబర్ నేరగాళ్లు కాల్ లేదా టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తారు. మీరు 5G సేవలకు మారడానికి అర్హులని, ఇది ఉచితం అని మీకు తెలియజేస్తారు. అప్పుడు వారు సేవలను సక్రియం చేయడంలో సహాయపడే ఓటీపీ  కోసం మిమ్మల్ని అడుగుతారు.
 
మీ మొబైల్‌కు ఓటీపీ పంపించి, దాన్ని తమకు చెప్పాలని అడుగుతారు. ఆ ఓటీపీని షేర్ చేయగానే ఫోన్‌ను హ్యాక్ చేసి అందులోని వ్యక్తిగత డేటాతో పాటు ఇతర వివరాలను తస్కరించడమే కాకుండా బ్యాంకు ఖాతాల్లోని డబ్బును కాజేస్తారు' అందువల్ల 5జీ సేవల యాక్టివేషన్ పేరుతో వచ్చే మెసేజ్‌లపై మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.