మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 డిశెంబరు 2022 (19:37 IST)

వైఎస్. జగన్ - కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలే : బండి సంజయ్

bandi sanjay
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ సీఎం ఇద్దరూ తోడు దొంగలేనంటూ మండిపడ్డారు. ఆయన చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర ఐదో విడత గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా కరీంనగర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించగా, ఇందులో బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా పాల్గొన్నారు. 
 
ఇందులో బండి సంజయ్ ప్రసంగిస్తూ, కరీంనగర్ గడ్డ గర్జిస్తే కొందరికి వెన్నులో వణుకు పుడుతుందన్నారు. ప్రజల కోసం, ధర్మ కోసమే బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు తమ పార్టీ కట్టుబడివుందన్నారు. 
 
తెలంగాణాలో అవినీతి, కుటుంబ పాలనను అంతమొందిస్తామని, తెలంగాణాను కాషాయపు జెండాతో పవిత్రం చేస్తామని ప్రకటించారు. కరీంనగర్ స్ఫూర్తితో గడీల పాలనపై పోరాడుతామని ఆయన పిలుపునిచ్చారు. తెరాసను బీఆర్‌ఎస్‌గా మార్చారని, బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని ఎద్దేవా చేశారు. 
 
ఇకపోతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరూ ఒక్కటేనంటూ జగన్, కేసీఆర్ పేర్లను ప్రస్తావించకుండానే ధ్వజమెత్తారు. దోచుకో.. దాచుకో అనే సిద్ధాంతంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాలన చేస్తున్నారన్నారు. ఇద్దరూ కలిసి బిర్యానీలు, కాళ్లకూర, బ్రెయిన్ కూర, చేపల పులుపు, రొయ్యల పులుపు, చికెన్, మటన్ కర్రీలు తిన్నారని, ఇద్దరూ సీఎంలు కలిసి ఇపుడు కొత్త నాటకానికి తీశారని ఆరోపించారు. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించి, దాన్ని ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు.