1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : బుధవారం, 9 నవంబరు 2022 (16:04 IST)

తెలంగాణాలోని గ్రానైట్ కంపెనీల్లో ముమ్మరంగా ఐటీ - ఈడీ సోదాలు

enforcement directorate
తెలంగాణ రాష్ట్రంలోని పలు గ్రానైట్ కంపెనీల యజమానుల గృహాల్లో ఆదాయపన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మూకుమ్మడిగా సోదాలకు దిగారు. ఈ కంపెనీలు విదేశీ మారకద్రవ్య చట్టం ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఫిర్యాదులు రావడంతో ఐటీ, ఈడీ అధికారులు సోదాలకు దిగారు. బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు దాదాపు 30 బృందాలుగా విడిపోయి హైదరాబాద్ నగరంతో పాటు కరీంనగర్‌లో ఈ సోదాలు చేశారు. 
 
ఐటీ శాఖ అధికారులు తోడుగా హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడ, అత్తాపూర్‌లో పలువురు గ్రానైట్ వ్యాపారుల ఇళ్ళు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నారు. కరీంనగరులోని గ్రానైట్ వ్యాపాలే లక్ష్యంగా ఈ సోదాలు చేస్తున్నారు. క్వారీ నిర్వాహకులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. 
 
మరోవైపు, తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఇంటిలోనూ సోదాలు చేస్తున్నారు. కరీంనగర్‌లోని గంగుల ఇంటితో పాటు మంకమ్మతోటలో ఉన్న కమలాకర్‌కు చెందిన శ్వేత గ్రానైట్స్, కమాన్ ప్రాంతంలోని మహవీర్, ఎస్వీఆర్ గ్రానైట్స్‌లో ఈ సోదాలు జరుగుతున్నాయి. 
 
గ్రానైట్ రాళ్ల ఎగుమతుల్లో భాగంగా పలు గ్రానైట్ కంపెనీలు ఫెమా నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలతో ఇదివరకే ఎనిమిది సంస్థలకు ఈడీ నోటీసులు జారీచేసిన విషయం తెల్సిందే.