1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 ఆగస్టు 2023 (14:04 IST)

సాయిచంద్ కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం అందించిన బీఆర్ఎస్

saichand family
గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఉన్న సాయిచంద్ అతి చిన్న వయసులోనే ఇటీవల కన్నుమూశారు. దీంతో ఆయన భార్య రజనీతో పాటు కుటుంబ సభ్యులు తీవ్రమైన బాధలో కూరుకునిపోయారు. ఆ కుటుంబాన్ని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేతలు ఆదుకుంటున్నారు. ఇందులోభాగంగా, సాయిచంద్ భార్యకు బీఆర్ఎస్ పార్టీ కోటి రూపాయల ఆర్థికసాయాన్ని అందించింది. ఈ చెక్కును మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జడ్పీ ఛైర్ పర్సన్ అనితా రెడ్డి, తెరాస నేత దాసోజు శ్రవణ్‌లు సాయిచంద్ ఇంటికి వెళ్ళి సాయిచంద్ భార్య రజనీకి అందించారు. అలాగే, సాయిచంద్ తల్లిదండ్రులు, సోదరికి కూడా మరో రూ.50 లక్షల చెక్కును ఇచ్చారు. 
 
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో సాయిచంద్ తన పాటలతో తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా నిలిచారని కొనియాడారు. ఆయన అకాల మరణం తీరని లోటని అన్నారు. భర్తను కోల్పోయిన రజనీ బాధ ఎలా ఉంటుందో తనకు తెలసన్నారు. సాయిచంద్ కుటుంబానికి అండగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. కాగా, సాయిచంద్ మరణంతో ఆయన భార్య రజనీని తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.