1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్

ఆంధ్రాలో ఓటు రద్దు చేసుకోండి.. వలస కార్మికులకు మంత్రి హరీష్ రావు పిలుపు

harish rao
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రా వలస కార్మికులకు తెలంగాణ మంత్రి హరీష్ రావు ఓ పిలుపునిచ్చారు. ఆంధ్రాకు, తెలంగాణాకు భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉందన్నారు. అందువల్ల ఏపీలో ఓటు రద్దు చేసుకుని తెలంగాణలో నమోదు చేసుకోవాలని వారికి సూచించారు. సంగారెడ్డిలో మంగళవారం మేస్త్రీ సంఘం భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
 
'ఎంతో మంది ఇతర రాష్ట్రాల వాళ్లు వచ్చి తెలంగాణలో స్థిరపడ్డారు. ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా చాలా మంది వచ్చారు. ఏపీ, తెలంగాణ.. ఈ రెండు ప్రాంతాలనూ మీరు చూశారు. మీరు ఎప్పుడన్నా అక్కడికి పోతారు కదా? అక్కడి రోడ్లు, దవాఖానాల పరిస్థితి ఏందో మీకు తెలియదా? అన్నీ చూశారు మీరు. మరి మీకు అక్కడ ఓటెందుకు? అక్కడ బంద్‌ జేసుకొని ఇక్కడ నమోదు చేసుకోండి. మీరు కూడా మావాళ్లే. తెలంగాణ పట్టణాల్లో, గ్రామాల్లో అభివృద్ధి కోసం చెమట చిందించే ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలేనని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఒక దిక్కే ఓటు పెట్టుకోండి.. అదీ తెలంగాణలోనే పెట్టుకోండి' అంటూ ఆంధ్రా కార్మికులను ఉద్దేశించి హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
 
కార్మికులకు మేడే రోజున సీఎం కేసీఆర్‌ శుభవార్త వినిపిస్తారన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఎకరా విస్తీర్ణంలో రూ.2 కోట్ల వ్యయంతో కార్మిక భవనాలను నిర్మిస్తామన్నారు. మేడే రోజున వీటికి శంకుస్థాపన చేస్తామన్నారు. కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రయోజనాలు పొందేందుకు వీలుగా భవన నిర్మాణ కార్మిక మండలిలో సభ్యత్వం తీసుకోవాలని ఆయన సూచించారు.