1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 23 జనవరి 2022 (17:51 IST)

కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం సర్టిఫికేట్

కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం సర్టిఫికేట్ మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం కేటాయించిన నిధుల్లో ప్రతి పైసా ఖర్చులోనూ పారదర్శకత పాటించిన స్వచ్ఛమైన ప్రాజెక్టు అని, రుణాలు చెల్లింపు సక్రమంగా సాగుతుందని పేర్కొంటూ కేంద్రం ప్రభుత్వం సర్టిఫికేట్‌ను మంజూరు చేసింది. 
 
కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోని రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్ఈసీ) కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు లిమిటెడ్‌కు ఏ కేటగిరీ గ్రేడ్ ఇచ్చింది. ఆర్ఈసీ దేశ వ్యాప్తంగా ప్రాజెక్టుల పనితీరు, నిర్వహణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని గ్రేడింగ్ కేటాయిస్తూ వస్తుంది. 
 
ఈ క్రమంలో ఒక ప్రాజెక్టు నిర్మాణం కోసం సేకరించిన నిధులను వినియోగించిన తీరు, వాటితో ఏమానా ఫలితాలు వచ్చాయా? రుణ వాయిదాలను సక్రమంగా కడుతున్నారా? గడువులోగా వాయిదాలు చెల్లిస్తున్నారా? ఆయా ప్రాజెక్టుల నిర్వహణపై ఆడిటింగ్ నిర్వహిస్తున్నారా? వంటి అంశాలను లోతుగా అధ్యయనం చేసి గ్రేడింగ్ ఇస్తుంది. 
 
కాళేశ్వరం నిర్మారణం, నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు లిమిటెడ్‌ను ఆర్ఈసీ ఏ క్యాటగిరీలో చేర్చింది. ఈఆర్‌సీ ద్వారా ఏ గ్రేడ్ క్యాటగిరీ సాధించిన దేశంలోని అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరం రికార్డు సృష్టించింది.