1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 డిశెంబరు 2021 (09:11 IST)

ఈ దశాబ్దంలోనే అత్యంత చలి రోజుగా శనివారం రికార్డు

తెలంగాణ రాష్ట్ర ప్రజలు చలితో గజగజ వణికిపోతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత అధికమైంది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్ నగరంలోనే అత్యంత చలిరోజుగా నమోదైంది. 
 
గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్శిటీలో శనివారం ఉదయం అత్యల్పంగా 8.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, పటాన్‌చెరులో 8.4 డిగ్రీలు, రాజేంద్ర నగర్‌లో 9.1 డిగ్రీలు చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 
 
అలాగే, శుక్రవారం రాత్రి సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యల్పంగా 6.5 డిగ్రీలు, మెయినాబాద్‌ మండలం రెడ్డిపల్లిలో 7.1 డిగ్రీలు, జహీరాబాద్‌ మండలం, సత్వార్ గ్రామంలో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయినట్టు అధికారులు వెల్లడించారు. 
 
గతంలో 2015 సంవత్సరం డిసెంబరు 13వ తేదీన హైదరాబాద్ నగరంలో అతి తక్కువగా 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత ఇంతకాలానికి మరోమారు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, వచ్చే మూడు రోజుల్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల తక్కువగా నమోదవుతుందని హైదరాబాద్ నగర ప్రాంతీయ వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. 
 
అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పగటిపూట ఉష్ణోగ్రతలు పడిపోడుతుండటంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్‌ను ప్రకటించింది. ఆదిలాబాద్, అసిఫాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అందువల్ల చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.