1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 11 జులై 2023 (09:21 IST)

యాప్ నిర్వాహకుల వేధింపులకు ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

suicide
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఈ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నెల్లికుదురు మండలం కొండెంగలగుట్ట తండాకు చెందిన బానోతు అచ్చాలి - కుస్సా దంపతుల కుమారుడు ఆకాశ్ (22) హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. 
 
ఈ విద్యార్థి కొన్ని నెలల క్రితం ఒక రుణ యాప్ ద్వారా రూ.30 వేల రుణం తీసుకున్నాడు. ఈ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో యాప్ నిర్వాహకులు నుంచి ఒత్తిడితో పాటు వేధింపులు మొదలయ్యాయి. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పగా, పొదుపు సంఘం నుంచి రుణం తీసుకుని చెల్లిద్దామని చెప్పాడు. 
 
ఇంతలో యాప్ నిర్వాహకుల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చిన ఆకాశ్.. ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోనే చీరతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.