1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (15:46 IST)

గణేష్ నిమజ్జనంపై సుప్రీంకు తెలంగాణ సర్కారు..

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇదే అంశంపై భాగ్యనగర ఉత్సవ కమిటీ సమితితో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చర్చలు జరిపారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా నిమజ్జనం ఏర్పాట్లు చేస్తామని మంత్రి వారికి తెలిపారు. 
 
అయితే హుస్సేన్ సాగర్‌లోనే తాము నిమజ్జనం చేపడతామని భాగ్యనగర ఉత్సవ కమిటీ స్పష్టం చేసింది. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని కోర్టు తన తీర్పులో చెప్పలేదని.. అయితే ఇందుకు కొన్ని షరతులు విధించిందని సభ్యులు అంటున్నారు. ఈ షరతుల అంశాన్ని ప్రభుత్వం చూసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కొందరు అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష వైఖరి కారణంగానే పరిస్థితి ఇలా మారిందని ఆరోపించారు.
 
మరోవైపు హైకోర్టు తీర్పు వచ్చిన అనంతరం సీఎం కేసీఆర్ ఈ అంశంపై ఉన్నతాధికారులు, పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి అడ్వకేట్ జనరల్‌ కూడా హాజరయ్యారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. తీర్పుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాటు ఏ విధంగా చేయాలనే దానిపై కూడా దృష్టి పెట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. 
 
హుస్సేన్ సాగర్ కాకుండా మరో 25 చెరువులను నిమజ్జనం కోసం అధికారులు గుర్తించారని.. ప్రతి వినాయక విగ్రహం ఎక్కడ నిమజ్జనం చేయాలనే అంశంపై జియో ట్యాగింగ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం నగరంలో మూడు చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను సిద్ధం చేసింది. సుప్రీంకోర్టులో వచ్చే తీర్పును బట్టి ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.