శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: బుధవారం, 19 డిశెంబరు 2018 (20:10 IST)

బంజారాహిల్స్ అపోలో హాస్పిటల్ పైన జిహెచ్ఎంసీ అధికారులు కొరడా

బంజారాహిల్స్ అపోలో హాస్పిటల్ పైన జిహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝళిపించారు. హస్పిటల్ నుండి రోడ్డు మీదకు నీళ్లు వదులుతున్నారని, దాంతో రోడ్లన్ని దెబ్బతింటున్నాయని జిహెచ్ఎంసీ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రెండుసార్లు నోటిసులు జారీ చేసిన హస్పిటల్ యాజమాన్యం వైఖరి మార్చుకోలేదని అందుకే రూ. 2 లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నామని కమిషనర్ దాన కిషోర్ తెలిపారు. 
 
హస్పిటల్ ముందు ఉన్న టిఫిన్ సెంటర్‌ను కూడా పరిశీలించిన కమిషనర్ అక్కడ పరిశుభ్రత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఫిన్ సెంటర్ ముందు అపరిశుభ్రంగా వ్యర్థాలు వేశారని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చి టిఫిన్ సెంటర్ సీజ్ చేశారు. ఎప్పుడు లేనిది నేరుగా జీహెచ్ ఎంసీ కమీషనర్ రంగంలోకి దిగి అపోలో హస్పిటల్ పైన రెండు లక్షల రూపాయల జరిమానా విధించండం చర్చనీయాంశమైంది.
 
కాగా అపోలో హస్పిటల్ ఎమ్‌డీగా సంగీతా రెడ్డి వ్యవహరిస్తున్నారు. సంగీతా రెడ్డి చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి భార్య. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇటివల టిఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టిఆర్ఎస్ పార్టీపై పలు విమర్శలు చేశారు. టిఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని నాయకులంతా కేసీఆర్ చెప్పినట్టే నడుచుకోవాలని లేకుంటే అవమానాలు తప్పవని సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
టిఆర్ఎస్‌లో ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి లేదని అందుకే బయటకొచ్చానని చెప్పారు. అంతేకాకుండా ఎన్నికల ముందు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి వల వేసినట్లు విమర్శలు కూడా వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ మర్రికి ఆఫర్ పెట్టినట్లు మర్రి ఆరోపించారు. ఆ తర్వాత ఎలాగూ టిఆర్ఎస్ బంపర్ మెజార్టీతో సర్కారు ఏర్పాటు చేయగలిగింది. కానీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీద సర్కారు నజర్ వేసిందన్న చర్చ మాత్రం ఉంది. 
 
టిఆఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన ఆయన, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. దేశ రాజకీయాలలో మార్పులు రావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. టిఆర్ఎస్‌లో మొత్తం నియంత పాలన సాగుతుందని, కేసీఆర్ చెప్పిందే ఆట, పాడిందే పాటగా టిఆర్ఎస్ రాజకీయాలు ఉన్నాయని ఆయన గతంలో ఆరోపించారు. టిఆర్ఎస్‌లో ఎంపీలకు విలువ లేదని వారిని అసలు పట్టించుకోరని విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.