1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

కేసీఆర్‌ బొమ్మ పెట్టుకుని పోటీ చేసినప్పటి కంటే ఇపుడే ఎక్కువ ఓట్లు : ఈటల

గతంలో తెరాస అధినేత కేసీఆర్ బొమ్మ పెట్టుకుని పోటీ చేసినప్పటి కంటే ఇపుడే తనకు ఎక్కువ ఓట్లు వచ్చాయని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన విజయభేరీ మోగించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఉప ఎన్నికల్లో తనను ఓడించడమే లక్ష్యంగా ఇక్కడికి వచ్చి.. నాపై దుష్పచారం చేసిన వారి భరతం పడతానని హెచ్చరించారు. ముఖ్యంగా, వారివారి నియోజకవర్గాల్లో త్వరలోనే పర్యటించి వారి కుట్రలను ప్రజలకు తెలియజేస్తానని తెలిపారు. 
 
కుట్రలు చేసిన వారు కుట్రలతోనే నాశనమవుతారని ఈ ఫలితం రుజువు చేసిందన్నారు. తనకు వచ్చిన  కష్టం శత్రువుకు కూడా రావొద్దని అన్నారు. కేసీఆర్‌ అహంకారంపై అంతిమంగా ప్రజలే గెలిచారన్నారు. ప్రపంచ చరిత్రలో ఇలాంటి ప్రలోభాలతో కూడిన ఎన్నిక ఎక్కడా జరగలేదన్నారు. తనకు ఒక్క ఓటూ పడకూడదన్న లక్ష్యంతో ప్రయత్నాలు చేసి.. విఫలమయ్యారిని అన్నారు. 
 
ముఖ్యంగా, పోలీసులే ఎస్కార్ట్‌ ఇచ్చి డబ్బులు పంపిణీ చేయించారన్నారు. కళ్ల ముందు రూ.లక్షలు కనిపించినా తిరస్కరించి అన్ని కుల సంఘాల వారు తన గెలుపునకు సహకరించారని చెప్పారు. తాను ఇంతకు ముందు కేసీఆర్‌ బొమ్మ పెట్టుకుని పోటీ చేసినప్పటి కంటే ఈ ఎన్నికలోనే ఎక్కువ ఓట్లు సాధించానంటూ భావోద్వేగానికి గురయ్యారు. 
 
తాను పార్టీలు మారే వాడిని కాదని, తన జీవితం తెరిచిన పుస్తకమన్నారు. తనను టీఆర్‌ఎస్‌ నుంచి వెళ్లగొట్టిన తర్వాత బీజేపీ అక్కున చేర్చుకుందని గుర్తు చేసుకున్నారు. కేంద్ర మంత్రి అమిత్‌షా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు రాష్ట్ర, జిల్లా నాయకులు తనకు సంపూర్ణ సహకారం అందించారన్నారు. ఓయూ, కేయూ విద్యార్థులతోపాటు ఎంతో మంది సోషల్‌ మీడియా వేదికగా కేసీఆర్‌ కుయుక్తులను చీల్చి చెండాడారని చెప్పారు.