శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 జులై 2021 (16:32 IST)

ఫ్లైఓవర్‌పై అదుపుతప్పిన బైక్... సెఫ్టీ గోడను గుద్దుకునీ...

హైదరాబాద్ నగరంలోని బాలా నగర్‌ ఫ్లైఓవర్‌పై ఓ బైక్ ప్రమాదం జరిగింది. ఈ బైక్ అమిత వేగంతో వెళుతూ సేఫ్టీ గోడను ఢీకొంది. దీంతో రైడర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడుగా గుర్తించారు. లైసెన్స్‌ తీసుకునేందుకు ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కొనిదెన గ్రామానికి చెందిన అశోక్(24) అనే యువకుడు లారీ డ్రైవర్‌గా చేస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ కేపీహెచ్‌బీలో ఉండే తన సోదరుడు ఇంటికి వచ్చిన అశోక్.. లైసెన్స్ తీసుకునేందుకు బైక్‌ మీద తిరుమలగిరిలోని ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాడు. 
 
హైదరాబాద్ బాలానగర్ వంతెనపై నుంచి అతి వేగంగా వెళ్తూ అదుపు తప్పి ఎడమవైపు ఉండే సేఫ్టీ డివైడర్‌ను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఆ కుర్రోడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైకుమీద ప్రయాణిస్తుండగా హెల్మెట్‌ ధరించకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయాడు. గమనించిన వాహనదారులు వెంటనే 108లో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అశోక్ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.