శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 జనవరి 2021 (08:38 IST)

చికిత్స కోసం వెళితే కువైట్ సేఠ్‌కు అమ్మేసిన వైద్యుడు..

అనారోగ్యం చేసిన ఓ మహిళ చికిత్స కోసం ఆస్పత్రికి వెళితే ఆమెను కువైట్ సేఠ్‌కు రెండు లక్షల రూపాయలకు అమ్మేశాడో వైద్యుడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, టోలీచౌకి సమతా కాలనీకి చెందిన తాహేరాబేగం (40) అనే మహిళ... అనారోగ్యంతో బాధపడుతూ గోల్కొండ కోటరా హౌస్ వద్ద ఉన్న షిఫా క్లినిక్‌కు వెళ్లింది. ఆ క్లినిక్‌ను నడుపుతున్న వైద్యుడు షబ్బీర్ హుస్సేన్‌.. ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. 
 
ఆ చర్వాత కువైట్‌లో ఓ ఇంట్లో పనిమనిషిగా చేరితే నెలకు రూ.25 వేలు సంపాదించవచ్చని ఆశ చూపాడు. కుమార్తెకు పెళ్లి చేసి అప్పులపాలైన తాహేరాబేగం ఆ వైద్యుడు మాటలు నమ్మి సమ్మతించింది. ఈ క్రమలో గతేడాది ఫిబ్రవరి 3వ తేదీన తాహేరాబేగం కువైట్ వెళ్లింది. అయితే, ఆమెను ఏకంగా కువైట్ సేఠ్ అల్ షమారీ అనే వ్యక్తికి అమ్మేశాడు. ఈ విషయం తెలియని తాహేరాబేగం.. కువైట్‌కు వెళ్లింది. ఇంట్లో పనికి చేరిన తర్వాత నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. తినడానికి తిండి కూడా సరిగా పెట్టడం మానేశారు. 
 
దీంతో తనను స్వదేశానికి పంపించాలంటూ మొరపెట్టుకుంది. కానీ, ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. పైగా, తాను రెండు లక్షల రూపాయలు ఇచ్చి నిన్ను కొనుగోలు చేసుకున్నానని యజమాని చెప్పడంతో ఆమె విస్తుపోయింది. దీంతో విషయాన్ని ఆమె హైదరాబాద్‌లో ఉన్న కుమార్తెకు చెప్పింది. ఆమె ఎంబీటీ నేత అమ్జాదుల్లాఖాన్ దృష్టికి తీసుకెళ్లింది. ఆయన ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.