1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 మార్చి 2022 (14:53 IST)

జానపద గాయకుడు జటావత్ మోహన్ బలన్మరణం

తెలంగాణా రాష్ట్రానికి చెందిన ప్రముఖ జానపద గాయకుడు జటావత్ మోహన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయన హైదరాబాద్ నగరంలోని చంపాపేటలో ఉంటున్న తన గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో విషాదచాయలు అలముకున్నాయి. 
 
నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం పల్లిగండ్ల తండాకు చెందిన మోహన్ గత కొంతకాలంగా హైదరాబాద్ నగరంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. ఈ క్రమంలో గత రాత్రి తన గదిలోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. 
 
ఈ విషయాన్ని బుధవారం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు మోహన్ మృతదేహాన్ని కిందికి దించి ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే, ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. ఆర్థిక సమస్యల కారణంగానే బలవన్మరణానికి పాల్పడివుంటారని పోలీసులు భావిస్తున్నారు.