శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 మార్చి 2022 (11:34 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిపోతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకునే నిరుద్యోగుల సంఖ్య అధికంగా ఉంది. ఈ విషయాన్ని సాక్షాత్ పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీలో గత ఐదేళ్ళలో 294 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు తెలిపారు. 
 
ముఖ్యంగా, గత 2015లో 55 మంది, 2016లో 36 మంది, 2017లో 55 మంది, 2018లో 44 మంది, 2019లో 71 మంది, 2020లో 88 మంది చొప్పున నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు తెలిపారు. 
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. గత ఐదేళ్ళలో తెలంగాణ వ్యాప్తంగా 188 మంది నిరుద్యోగులు బలవన్మరణానికి పాల్పడినట్టు చెప్పారు. 2016లో 24, 2017లో 45, 2018లో 40, 2019లో 56, 2020లో 23 మంది చొప్పున ఆత్మహత్యలు చేసుకున్నట్టు పేర్కొన్నారు.