శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2022 (09:53 IST)

'పరీక్ష బాగా రాసి రా' అని చెప్పిన తల్లి.. ఉసురు తీసుకున్న విద్యార్థిని!

meghana reddy
హైదరాబాద్ నగరంలోని జేఎన్టీయూ క్యాంపస్‌లో ఉత్తమ విద్యార్థిని ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని క్లాస్ రూమ్ కాంప్లెక్స్ భవనంపై నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
ఏపీలోని నెల్లూరు జిల్లా కొడవలూరుకు చెందిన ఇసానక మనోజ్ కుమార్ రెడ్డి తన కుటుంబంలో హైదరాబాద్ నగరంలో స్థిరపడ్డారు. వీరి కుమార్తె మేఘనా రెడ్డి (21) జేఎన్టీయూలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతోంది. 
 
బుధవారం ఉదయం ఇంటర్నల్ పరీక్ష రాసిన మేఘన మధ్యాహ్నం 2 గంటలకు చివరి యేడాది సెమిస్టర్ పరీక్ష రాయాల్సి వుంది. దానికి పావుగంట ముందు అంటే మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో క్యాంపస్‌లో మైదానం పక్కన ఉన్న నాలుగు అంతస్తుల భవనంపైకి వెళ్లి కిందకు దూకేసింది. దీన్ని గమనించిన విద్యార్థులు, స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మేఘన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ వార్త తెలుసుకున్న తోటి విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు బోరున విలిపించారు. కాగా, మేఘన ఎంసెట్‌లో 200 ర్యాంకు సంపాదించింది. యేడాది కాలంగా మానసిక చికిత్స తీసుకుంటున్న ఈ విద్యార్థినిని తల్లి తన కారులో కాలేజీకి తీసుకొచ్చి, తరగతులు ముగిసేంత వరకు అక్కడే ఉండి మళ్లీ ఇంటికి తీసుకెళ్లేది. బుధవారం కూడా మధ్యాహ్నం 1.40 గంటల వరకు కుమార్తెతోనే ఉండి అన్నం తినిపించిన తల్లి... పరీక్ష బాగా రాసి రా అని చెప్పి అటు వెళ్లగానే మేఘన ఈ దారుణానికి పాల్పడింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.