1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2023 (14:57 IST)

ఆస్పత్రి బిల్లు చెల్లించలేక నవజాత శిశువును వదిలివేసి వెళ్లిన తల్లిదండ్రులు

birth
ఓ నవజాత శిశువు చికిత్స కోసం ఒక కార్పొరేట్ ఆస్పత్రి వేసిన బిల్లు చూసి ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఆ బిల్లును చెల్లించలేక తమ 13 రోజుల బిడ్డను ఆస్పత్రిలోనే వదిలివేసి వెళ్లిపోయారు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సింగరేణి కాలనీ రోడ్డు నంబర్ 14కు చెందిన నితిన్‌ (23), రవళిక (20) అనే వారు గత యేడాది పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ దినసరి కూలీలు. వీరికి ఈ నెల ఏడో తేదీన పాప జన్మించింది. ఆ పాపకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అదే రోజు నిలోఫర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వెంటిలేటర్‌ ద్వారా వైద్యం అందించి ఆరోగ్యం కుదుటపడడంతో ఇంటికి పంపించారు. 
 
ఇంటికి వచ్చిన తర్వాత పాప శరీరంలో మార్పు రావడంతో తల్లిదండ్రులు స్థానిక వైద్యుడిని సంప్రదించారు. వైద్యుడు పరిశీలించి చిన్నారికి మెరుగైన చికిత్స అవసరమని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దాంతో పిసల్‌బండలోని ఓ కార్పొరేట్ దవాఖానాకు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు వైద్యం అందించారు. 
 
ఆరోగ్యం కుదుట పడటంతో ఐదు రోజుల క్రితం డిశ్చార్జి చేశారు. ఈ చికిత్సకు మొత్తం రూ.1.16 లక్షలు బిల్లు వేశారు. తమ వద్ద ఉన్న రూ.35 వేలు చెల్లించారు. మిగతా డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో చిన్నారిని ఆసుపత్రిలోనే వదిలేసి వచ్చారు. మంగళవారం విలేకరుల ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు.