బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 14 జూన్ 2019 (16:48 IST)

హైదరాబాద్‌లో కిన్లే వాటర్ బాటిల్ 207 రూపాయలా?

మందుబాబులు ఆ బార్‌కు వెళితే..  ప్రతి పెగ్గులోనూ మోసం. బహిరంగ మార్కెట్లో కిన్లే వాటర్ బాటిల్ ధర 20 రూపాయలు కదా? మరి ఆ బాటిల్ ధరను 207కి అమ్ముతున్నారా ? అంటే... అవును అనే సమాధానం వస్తోంది. ఇంతకీ ఈ రేట్లు ఎక్కడంటే హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో ఓ ప్రముఖ బార్ అండ్ రెస్టారెంట్‌లో. 
 
ఆ బార్‌లో కిన్లే వాటర్ బాటిల్ 207 రూపాయలు అమ్ముతున్నారు. ఈ బార్ పైన తూనికలు కొలతల శాఖ అధికారుల దాడులు చేసిన సందర్భంలో ఈ ధరలు చూసి అధికారులే ఆశ్చర్యపోయారు. 20 రూపాయల కిన్లే వాటర్ బాటిల్‌ను 207 రూపాయలకు అమ్మడంతో పాటు, 99 రూపాయల రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్‌ను 209 రూపాయలకు బార్ నిర్వాహకులు అమ్ముతున్నారు. 
 
అంతేకాదు మద్యం ప్రియులు తాగే ప్రతి పెగ్గులోనూ 11 శాతం మందును తక్కువగా సర్వ్ చేస్తున్నట్టు గుర్తించారు అధికారులు. ఈ విధంగా వినియోగదారులు బాగా నష్టపోతున్నారు. అలా మద్యం తాగే మద్యం ప్రియులు చెల్లించే ప్రతి 1336 రూపాయల బిల్లులో 147 రూపాయలు మోసానికి పాల్పడుతున్న వైనాన్ని గుర్తించి, 
బార్ నిర్వాహకులపై మూడు కేసులు నమోదు చేసారు తూనికలు కొలతల శాఖ అధికారులు.