శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : గురువారం, 24 నవంబరు 2022 (07:44 IST)

మంత్రి మల్లారెడ్డి నివాసంలో రూ.6 కోట్ల నగదు స్వాధీనం : ఐటీ అధికారులు

malla reddy
తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు నివాసాల్లో జరిపిన ఆదాయ పన్ను శాఖ అధికారులు రెండు రోజుల పాటు జరిపిన సోదాల్లో దాదాపు రూ.ఆరు కోట్ల మేరకు నగదు లభించిందని ఐటీ అధికారులు వెల్లడించారు. అలాగే, మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని వారు తెలిపారు. 
 
గత హైదరాబాద్ రీజియన్ పరిధిలోని ఐటీ అధికారులతో పాటు ఒరిస్సా, కర్నాటక రాష్ట్రాల నుంచి వచ్చిన దాదాపు 400 మంది అదికారులు 65 బృందాలుగా విడిపోయి ఈ సోదాల్లో పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో ఈ సోదాలు ముగియగా, మరికొన్ని చోట్ల ఇంకా కొనసాగుతున్నాయి. 
 
ఈ సోదాలపై ఐటీ అధికారులు స్పందిస్తూ, మంత్రి మల్లారెడ్డి విద్యా సంస్థల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించాయమన్నారు. ప్రభుత్వ రాయితీలతో సొసైటీ కింద నడుస్తున్న మల్లారెడ్డి విద్యా సంస్థల్లో నిర్ధేశించిన ఫీజు కంటే అధిక మొత్తాన్ని వసూలు చేసినట్టు గుర్తించినట్టు తెలిపారు. 
 
అలాగే, లెక్కల్లో చూపకుండా నగదు రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని స్థిరాస్తి వ్యాపారంలోకి మళ్లించారని, అలాగే, మల్లారెడ్డి - నారాయణ ఆస్పత్రి కోసం వెచ్చిస్తున్నట్టు చెప్పారు. 
 
మరోవైపు, ఈ ఐటీ సోదాలపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఈ సోదాల వల్ల తమకెలాంటి నష్టం లేదన్నారు. అన్ని అనుమతులతోనే ఆస్పత్రులు, కళాశాలలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వాటి ఆస్తుల వివరాలను అధికారులకు అందజేశామని, అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నట్టు చెప్పారు.