శుక్రవారం, 5 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్

వీరభద్రవరం ముత్యాల జలపాతంలో చిక్కుకున్న 42 మంది పర్యాటకులు

muthyala waterfalls
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా వీరభద్రవరం ముత్యాల జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన పర్యాటకుల్లో 42 మంది ప్రమాదంలో చిక్కుకున్నారు. వీరంతా అడవీ ప్రాంతంలోనే చిక్కుకునిపోయారు. ఈ జలపాతాన్ని చూసేందుకు బుధవారం ఉదయం వెంకటాపురం పరిధిలోని ఈ జలపాత సందర్శనకు వెళ్లారు. వారు తిరిగి వచ్చే సమయంలో భారీ వర్షం కురవడంతో వాగు ఉప్పొంగింది. దీంతో అటవీ ప్రాంతంలోని ఉండిపోయారు. అక్కడ నుంచి వారు 100 నంబరుకు ఫోన్ చేసి సమాచారం చేరవేశారు. దీంతో విషయం వెలుగు చూసింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగనుంది. పర్యాటకులను వెంటనే క్షేమంగా తీసుకు రావాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు.
 
మరోవైపు మహబూబాబాద్ నామాలపాడు వద్ద జన్నెల వాగు పొంగిపొర్లింది. దీంతో ఓ ఆర్టీసీ బస్సు వాగులో చిక్కుకుంది. ఆ సమయంలో బస్సులో పదిహేను మంది ప్రయాణికులు ఉన్నారు. అధికారులు వారిని సురక్షితంగా బయటకు తీసి, ఆ తర్వాత ట్రాక్టర్ సాయంతో బస్సును ఒడ్డుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి వరద పోటెత్తింది. నీటి మట్టం పెరుగుతోంది. ఈ రోజు మధ్యాహ్నం నీటి మట్టం 44.4 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.