శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి

నాలుగేళ్ల చిన్నారిపై దాడి.. 20 ఏళ్ల జైలు శిక్ష.. నాంపల్లి కోర్టు

నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి.. లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడికి 20 ఏళ్ల జైలుశిక్ష పడింది. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండేండ్ల క్రితం చోటు చేసుకున్న సంఘటనపై బుధవారం నాంపల్లిలోని ఒకటవ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి సునీత కుంచాల ఈ మేరకు తీర్పును వెలువరించారు.

వివరాల్లోకి వెళితే... అసిఫ్‌నగర్‌కు చెందిన ఓ మహిళ తన నాలుగేళ్ల కూతురుతో కలిసి 2018 మే 27న రహ్మత్‌నగర్‌ సమీపంలోని బ్రహ్మశంకర్‌నగర్‌లోని పుట్టింటికి వచ్చింది. పక్కనే ఉన్న కిరాణాషాపునకు వెళ్లి షాంపు తీసుకురావాలని చిన్నారిని తల్లి పంపించింది. 
 
షాపునకు వెళ్లివస్తున్న చిన్నారిని గమనించిన డిప్పు కుమార్‌ శ్రీవాత్సవ్‌ అలియాస్‌ దీపు(22) చాక్లెట్‌ ఇస్తానంటూ తనగదిలోకి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. కాసేపటికి చిన్నారిని వెతుక్కుంటూ వచ్చిన కుటుంబ సభ్యులు దీపు గదిలోకి వెళ్లి చూడగా జరిగిన విషయం తెలిసింది. వారిని చూసిన డిప్పు కుమార్‌ అక్కడినుంచి పారిపోయాడు. 
 
ఈ మేరకు చిన్నారి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో జూబ్లీహిల్స్‌ పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు అత్యాచారం, కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు. కేసులో పక్కా ఆధారాలు సమర్పించడంతో బుధవారం డిప్పు కుమార్‌కు 20ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించారు.