1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 జులై 2022 (09:07 IST)

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్

nvramana
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేయనుంది. ఈ మేరకు యూనివర్శిటీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 
 
వచ్చే నెల ఐదో తేదీన సాయంత్రం వర్శిటీలో జరుగనున్న 82వ స్నాతకోత్సవంలో జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేయనున్నారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. 
 
కులపతి హోదాలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ హాజరుకానున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం చివరిసారిగా 2001లో ప్రముఖ భారత - అమెరికన్‌ కంప్యూటర్‌ ఇంజినీర్‌ అరుణ్‌ నేత్రావలికి గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. తర్వాత రెండు దశాబ్దాలుగా ఎవరికీ ఇవ్వలేదు.
 
ఉస్మానియా యూనివర్సిటీ 105 ఏళ్ల చరిత్రలో 81 స్నాతకోత్సవాలు నిర్వహించింది. ఇప్పటివరకు 47 మందికి మాత్రమే గౌరవ డాక్టరేట్లు ప్రకటించింది. తొలిసారిగా 1917లో నవాబ్‌ జమాదుల్‌ ముల్క్‌ బహదూర్‌కు ఇచ్చింది. 
 
తెలుగు వ్యక్తి అయిన ఆయన.. దేశ సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిగా గతేడాది ఏప్రిల్‌ 24 నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను గౌరవ డాక్టరేట్‌కు ఎంపిక చేస్తూ ఓయూ నిర్ణయం తీసుకుంది.