గురువారం, 27 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 అక్టోబరు 2023 (13:03 IST)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : 33 సీట్లలో జనసేన పార్టీ పోటీ!!

pawan - shah
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో హీరో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ 33 చోట్ల పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకుసాగానుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కలిసి పనిచేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ సూచించారు. ఇప్పటికే ఈ అంశంపై ప్రాథమిక అవగాహనకు వచ్చిన ఇరుపార్టీల నేతలు బుధవారం సాయంత్రం అమితాను కలిసి సుమారు 40 నిమిషాలపాటు చర్చించారు. 
 
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తాను శుక్రవారం హైదరాబాద్‌కు వస్తున్నానని, ఆలోపు సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు రావాలని వారికి అమితా సూచించినట్లు తెలిసింది. అందుకు కిషన్ రెడ్డి, పవన్ కల్యాణ్ అంగీకరించారు. అంతర్గతంగా పార్టీల్లో చర్చించుకొని ఎవరెక్కడ పోటీ చేయాలనుకుంటున్నదీ చెబుతామని వారు చెప్పినట్లు సమాచారం. జనసేన నాయకులు ఉమ్మడి హైదరాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, మెదక్ జిల్లాల్లో 33 సీట్లు అడుగుతున్నట్లు తెలిసింది.
shah - pawan
 
అలాగే, ఈ సమావేశంలో అమిత్, పవన్ కల్యాణ్‌లు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కూడా మాట్లాడుకున్నట్లు తెలిసింది. ఆ రాష్ట్రంలో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితుల గురించి హోంమంత్రికి పవన్ కల్యాణ్ వివరించగా.. ఆంధ్రప్రదేశ్‌కు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటామని, రాష్ట్ర అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తామని, కష్టపడి పనిచేయాలని ఆయన సూచించినట్లు సమాచారం. 
 
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో కలిసివెళ్లాలని పవన్ కల్యాణ్ నిర్ణయించినందువల్ల తెలంగాణలోనూ టీడీపీ కలిసివస్తుందా అన్న ప్రశ్నకు కిషన్ రెడ్డి బదులిస్తూ "జనసేన ఒక్కటే ఎన్డీయే భాగస్వామి. అంతవరకే మా చర్చలు ఉంటాయి" అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన వైఖరి ఎలా ఉన్నా, తెలంగాణలో భాజపాతో కలిసి పోటీ చేయాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. జనసేన ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. నవంబరు 1న కేంద్ర ఎన్నికల కమిటీలో చర్చించి రెండో జాబితాను విడుదల చేస్తామని చెప్పారు.