1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 ఏప్రియల్ 2021 (17:50 IST)

మావోయిస్టులు చనిపోతే ఎందుకు మాట్లాడట్లేదు... ప్రొఫెసర్ హరిగోపాల్

మావోయిస్టులు చనిపోతే ఎందుకు మాట్లాడటం లేదని పౌర సంఘం నేత, ప్రొఫెసర్ హరగోపాల్ ప్రశ్నించారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, మావోయిస్టులు శాంతి చర్చలకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తుందన్నారు. కానీ ప్రభుత్వం, మావోల మధ్య మధ్యవర్తిత్వం వ్యవహరించే వ్యక్తులు ఎవరు అనేది తేల్చుకోవాలి అని సూచించారు. 
 
మావోలు, ప్రభుత్వం అనుకుంటే శాంతి చర్చలు జరగవు, పౌర సమాజం కోరుకోవాలన్నారు. పౌర సమాజం, మేధావులు కలిసి మావోలు పైన ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తేనే సాధ్యం అవుతుందని చెప్పుకొచ్చారు. 
 
వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాంతి చర్చలు పేరుతో మావోల ఉనికిని పసి గట్టి, అంతం చేయాలని చూశారని ఆరోపించారు. గత 50 ఏళ్లుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అని వెల్లడించారు. 
 
శాంతి మార్గం కోసమే పౌర సంఘo ఏర్పడింది అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చర్చలు విఫలం అయ్యాయి అని పేర్కొన్నారు. చర్చల ప్రస్తావన ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం కూడా తీసుకొచ్చింది అని ఆయన వ్యాఖ్యానించారు. కానీ ఛత్తీస్‌గఢ్‌లో ప్రజా గొంతుకలు లేవు, న్యాయ నిపుణులు లేరు అని అన్నారు.
 
 
ఛత్తీస్‌గఢ్‌లో పరిస్థితి మారాలంటే అక్కడి ప్రభుత్వ విధానం కూడా మారాలన్నారు. మావోయిస్టులు సాయుధ పోరాటాల ద్వారానే మేలు జరుగుతుంది అనే ధోరణిపై పునరాలోచించాలి అని కోరారు. రాజ్యహింస పెరిగినప్పుడు పౌర సంఘాలు ఏర్పడుతాయని అన్నారు. మావోయిస్టు సమస్య పరిష్కారం కోసం పౌర సంఘo కూడా ప్రయత్నం చేస్తుంది అని పేర్కొన్నారు. 
 
తెలుగు రాష్ట్రాల్లో ప్రశ్నిస్తున్న గొంతుకలపై ప్రభుత్వాలు అణిచివేత ధోరణి మానుకోవాలి అని సూచించారు. కూంబింగ్‌లో పోలీసులు ప్రాణాలు కోల్పోతే మావోలను ప్రశ్నించడానికి మీడియా, ప్రజలు, మేధావులు ఉన్నారు అని, కానీ అదే పోలీసుల చేతిలో నక్షలైట్లు చనిపోతే ప్రశ్నించడానికి ఎవరు ఉన్నారు అని నిలదీశారు. పౌర హక్కుల సంఘం  రెండు వైపులా జరిగే నష్టాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం, ఎవరివైన ప్రాణాలే అని ఆయన స్పష్టం చేశారు.