1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (09:09 IST)

ప్రగతి భవన్‌ను నక్సలైట్లు పేల్చివేయాలి : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

revanth reddy
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌‍ను నక్సలైట్లు పేల్చివేయాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తాను చేపట్టిన "హత్ సే హాత్ జోడో" పాదయాత్రలో భాగంగా ఆయన ములుగులో పర్యటిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో ప్రగతి భవన్‌పై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు అందుబాటులో లేని ప్రగతి భవన్‌ను నక్సలైట్లు పేల్చివేయాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. 
 
హైదరాబాద్ నడిబొడ్డున 10 ఎకరాల స్థలంలో రూ.2 వేల కోట్లతో నిర్మించిన 150 గదుల ప్రగతి భవన్ కేవలం సంపన్న ఆంధ్ర పెట్టుబడిదారులకు రెడ్‌కార్పెట్ వేసి స్వాగతం పలికేందుకు మాత్రమే ఉపయోగపడుతోందని, పేదలకు అందుబాటులో లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రగతి భవన్‌లో పేద ప్రజలకు న్యాయం జరగదని రేవంత్ రెడ్డి అన్నారు.