శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 డిశెంబరు 2020 (10:04 IST)

ఓటుకు నోటు కేసు: చంద్రబాబు పేరును చేర్చాలన్న కేసు వచ్చే యేడాదికి వాయిదా!

తెలంగాణ రాష్ట్రంలో ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ కేసులో అప్పటి తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి ప్రధాన నిందితుడుగా ఉన్నారు. ఈ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేరును కూడా చేర్చాలని పేర్కొంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను వచ్చే ఏడాది జులై 17కు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. 
 
2017లో దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను త్వరగా విచారించాలని కోరుతూ దాఖలు చేసిన ఎర్లీ హియరింగ్ అప్లికేషన్‌ను గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే, జస్టిస్ బోపన్న, జస్టిస్ రామసుబ్రహ్మణ్యంలతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్‌ తరపున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్, న్యాయవాది అల్లంకి రమేశ్‌లు వాదనలు వినిపించారు.
 
రాజకీయనేతల ప్రమేయం ఉన్న కేసులను వీలైనంత త్వరగా విచారించాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలను పిటిషనర్ తరపు న్యాయవాదులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం ఉన్నప్పటికీ తెలంగాణ ఏసీబీ కూడా ఆయన పేరును చేర్చలేదని కోర్టుకు తెలిపారు. స్పందించిన న్యాయస్థానం కేసును జులైలో విచారిస్తామని చెబుతూ ‘ఎర్లీ హియరింగ్ అప్లికేషన్’పై విచారణ ముగిస్తున్నట్టు తెలిపింది.