1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 జనవరి 2022 (12:07 IST)

జ్వరం లక్షణాలు ఉంటే.. అక్కడికక్కడే కిట్స్ పంపిణీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి డోర్ టు డోర్ ఫీవర్ సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈ సర్వేలో భాగంగా, ప్రతి ఇంటింటికి ఆరోగ్య కార్యకర్తలు వెళ్లి కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు చేస్తారు. వీరిలో ఎవరికైనా జ్వర లక్షణాలు ఉన్నట్టు తేలితే అక్కడికక్కడే  మందుల కిట్స్‌ను అందజేస్తారు. అలాగే, సదరు వ్యక్తిని హో ఐసోలేషన్‌లో ఉంచేలా చర్యలు తీసుకుంటారు. 
 
గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు శరవేగంగా పెరుగుతోంది. ఫలితంగా ప్రతి రోజూ వేలాది కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఇంటింటికి ఫీవర్ సర్వే చేయాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 
 
రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న దరిమిలా శుక్రవారం నుంచి జ్వర సర్వే (ఫీవర్ సర్వే)ను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 
 
ఆ తర్వాత మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ఫీవర్ సర్వేలో జ్వర లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తామన్నారు. జ్వరం ఉన్నవారికి అక్కడికక్కడే హోం ఐసోలేషన్‌ కిట్లను కూడా పంపిణీ చేస్తామన్నారు. కరోనా రెండో దశ అల సమయంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వే దేశంలోని పలు రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచిందని గుర్తుచేశారు. 
 
ప్రస్తుతం దేశంలో కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతోందని గుర్తుచేసిన మంత్రి హరీష్ రావు అనేక మందిలో ఈ లక్షణాలు కనిపించడం లేదని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 27 వేల పడకలను ఆక్సిజన్ బెడ్లుగా మార్చామని, 76 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను నెలకొల్పామని మంత్రి హరీష్ రావు ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.