గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Updated : శుక్రవారం, 19 జూన్ 2020 (20:46 IST)

కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రూ. 5 కోట్లు, భార్యకు గ్రూప్ 1 ఉద్యోగం: కేసీఆర్

గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు.
 
ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరుఫున సహాయం ప్రకటించారు. సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్ల నగదు, నివాస స్థలం, ఆయన భార్యకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తానే స్వయంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్లి సహాయం అందించనున్నట్లు వెల్లడించారు.
 
ఇదే ఘర్షణలో మరణించిన మిగతా 19 మంది కుటుంబ సభ్యులకు కూడా ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తరుఫున కేంద్ర రక్షణ మంత్రి ద్వారా అందిస్తామని సిఎం వెల్లడించారు. ‘‘సరిహద్దుల్లో దేశ రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సైనికులకు యావత్ దేశం అండగా నిలవాలి. వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలను ఆదుకోవాలి. తద్వారా సైనికుల్లో ఆత్మ విశ్వాసం, వారి కుటుంబాల్లో భరోసా నింపాలి.
 
దేశమంతా మీ వెంటనే ఉందనే సందేశం అందించాలి. వీర మరణం పొందిన సైనికులకు కేంద్ర ప్రభుత్వం ఎలాగూ సాయం చేస్తుంది. కానీ రాష్ట్రాలు కూడా సహాయ సహకారాలు అందించాలి. అప్పుడే సైనికులకు, వారి కుటుంబాలకు దేశం మా వెంట నిలుస్తుందనే నమ్మకం కుదురుతుంది. సింబల్ ఆఫ్ యూనిటీ ప్రదర్శించాలి. కరోనాతో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ మిగతా ఖర్చులు తగ్గించుకుని అయినా సైనికుల సంక్షేమానికి పాటు పడాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడి నిర్వహించిన అఖిలపక్ష సమావేశం సందర్భంగా చెప్పారు.