శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 అక్టోబరు 2019 (13:45 IST)

ఏం ఒరగబెట్టారు..!? డెంగ్యూతో చనిపోతే రూ.50 లక్షలు ఇవ్వాలి : తెలంగాణ హైకోర్టు

తెలంగాణ రాష్ట్రంలో నానాటికీ డెంగ్యూతో చనిపోతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. అలాగే, డెంగ్యూ కేసులు కూడా అధికంగా నమోదవుతున్నాయి. దీనిపై ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. 30 రోజుల ప్రణాళికలో ఏం ఒరగబెట్టారంటూ నిలదీసింది. పైగా, డెంగ్యూను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైతే మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలంటూ తాజాగా ఆదేశాలు జారీచేసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇటీవలి కాలంలో పలువురు రోగులు డెంగ్యూ వ్యాధితో మృతి చెందారు. ఇలా డెంగ్యూ వ్యాధితో మరణిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందంటూ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో గురువారం ఈ వ్యవహారంపై కోర్టుకు.. తెలంగాణ సీఎస్‌ వివరణ ఇచ్చుకున్నారు. 
 
ఈ క్రమంలో ప్రభుత్వం తరపున నివారణ చర్యలు తీసుకున్నామని సీఎస్‌ ఎస్కే జోషి చెప్పారు. అయితే.. నివారణ చర్యలు తీసుకుంటే డెంగ్యూ కేసులు ఎందుకు నమోదవుతున్నాయ్? అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్‌ మాటలు... వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉన్నాయన్న హైకోర్టు కన్నెర్రజేసింది.
 
పైగా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లోనూ నదుల మధ్యే నగరాలున్నాయన్న విషయాన్ని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. 30 రోజుల ప్రణాళికలో ఏం ఒరగబెట్టారని హైకోర్టు ప్రశ్నించింది. 'ప్రణాళికలన్నీ పేపర్లపైనే ఉన్నాయి.. వాస్తవ రూపం దాల్చలేదు. మూసీ పక్కనున్న హైకోర్టులోనే విపరీతమైన దోమలున్నాయి. జనవరిలో 85 డెంగ్యూ కేసులు నమోదైతే అక్టోబర్‌ నాటికి 3800 కేసులు పెరిగాయి. డెంగ్యూను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైతే మృతుల కుటుంబాలకు రూ.50లక్షలు ఇవ్వాలి' అని హైకోర్టు తేల్చిచెప్పింది.