గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 జూన్ 2023 (16:06 IST)

చనిపోయిన అప్సరకు పెళ్లయిందా లేదా అనేది అప్రస్తుతం : మృతురాలి తల్లి

apsara marriage
హైదరాబాద్ నగరంలో దారుణ హత్యకు గురైన అప్సరకు ఇదివరకే వివాహమైందా లేదా అన్నది అప్రస్తుతమని మృతురాలి తల్లి అరుణ అన్నారు. పైగా, తన కుమార్తెకు పెళ్లయిందన్న విషయంపై ఆమె స్పందించేందుకు నిరాకరించింది. తన కుమార్తెను చంపిన సాయికృష్ణను దేవుడే శిక్షిస్తాడని ఆమె శాపం పెట్టారు. పైగా చనిపోయిన తన కుమార్తె అప్సర గురించి తప్పుగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అంటూ ఆమె ప్రశ్నించారు. తన కుమార్తె ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నారంటూ ఆమె బోరున విలపిస్తూ చెప్పారు. 
 
హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్‌లో అప్సర దారుణ హత్యకు గురైన విషయం తెల్సిందే. ఈ హత్య కేసులో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్సరకు గతంలోనే వివాహమైందన్న విషయం తాజాగా బయటపడింది. ఆమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
అప్సరకు మూడేళ్ల కిందటే చెన్నైకి చెందిన వ్యక్తితో వివాహం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. అయితే పోలీసులు దీనిపై స్పష్టత ఇవ్వలేదు. భర్తతో విభేదాల కారణంగా ఏడాది కిందట సరూర్‌నగర్‌‌లోని పుట్టింటికి అప్సర వచ్చిందని తెలుస్తోంది.
 
ఈ క్రమంలోనే బంగారు మైసమ్మ ఆలయంలో పూజారిగా పనిచేసే సాయికృష్ణతో పరిచయం ఏర్పడింది. ఇద్దరిదీ ఒకే కమ్యూనిటీ కావడంతో అది కాస్త ప్రేమ, వివాహేతర సంబంధానికి దారితీసింది. తనను పెళ్లి చేసుకోవాలని సాయిపై అప్సర ఒత్తిడి తెచ్చింది. పెళ్లి విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే అప్సరను ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లి సాయికృష్ణ హత్య చేశాడు.
 
మరోవైపు అప్సర హత్య కేసులో నిందితుడు సాయికృష్ణను రాజేంద్రనగర్ కోర్టులో హాజరు పరచగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో సాయికృష్ణను చర్లపల్లి జైలుకు తరలించారు. జూన్ 22 వరకు అతడు రిమాండ్‌లోనే ఉండనున్నాడు. సాయి కృష్ణపై 302, 201 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.