1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

కుమార్తెను వేధిస్తున్నాడనీ... అల్లుడుని చంపిన మామ.. ఎక్కడ?

తెలంగాణ రాష్ట్రంలోని మణికొండలో దారుణం జరిగింది. కుమార్తెను వేధిస్తున్నాడన్న కారణంగా అల్లుడుని ఓ మామ మరో ముగ్గురితో కలిసి చంపేశాడు. అల్లుడుని కిడ్నాప్ చేసి చెరువుగట్టు వద్దకు తీసుకెళ్లి మెడకు ఉరిబిగించి, తలపై బండరాయితో కొట్టి చంపేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, టోలిచౌకి ఎండీ లైన్స్‌కు చెందిన షేక్‌ సల్మాన్‌(25) అనే వ్యక్తి బ్లాక్‌ బర్డ్‌ బ్యూటీ పేరుతో మణికొండ సాయి నగర్‌లో లేడీస్‌ టైలర్‌ షాపు నిర్వహిస్తున్నాడు. ఈయన సోదరుడు రిజ్వాన్‌(16) హఫీజ్‌పేటలోని వస్త్ర దుకాణంలో పనిచేస్తుంటాడు. 
 
జనవరి 29 శుక్రవారం ఉదయం తమ్ముణ్ని వస్త్ర దుకాణం వద్ద వదిలి వెళ్లాడు. రాత్రి 10.30 ప్రాంతంలో తమ్ముడికి ఫోన్‌ చేసి కొద్దిసేపట్లో వస్తానని చెప్పాడు. ఎంతకీ రాకపోవడంతో అనుమానించి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా అదృశ్యం కేసు నమోదు చేశారు.
 
అయితే, సల్మాన్‌కు 2019లో గోల్కొండ అక్బర్‌పురాకు చెందిన ఫర్హానాతో వివాహమైంది. భర్త హింసిస్తుండగా ఏడు నెలలుగా ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఈ నేపథ్యంలో అతడి మామ జిలాని, మరో ముగ్గురు శుక్రవారం రాత్రి కారులో షాపు వద్దకు వెళ్లి సల్మాన్‌ను అపహరించి మొయినాబాద్‌ నక్కలపల్లి చెరువు వద్దకు తీసుకెళ్లారు. 
 
దారిలో మెడకు ఉరిబిగించారు. చెరువు వద్ద బండరాయితో కొట్టి చంపేశారు. ఆదివారం మృతదేహాన్ని కనుగొన్నారు. హత్య చేసిన వారిలో దస్తగిరి అనే నిందితుడిని రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.