శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 15 జనవరి 2021 (13:54 IST)

నిరుద్యోగుల ఆగ్రహం.. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల్లో టీచర్ల పోస్టులు కొన్నివేల సంఖ్యలో ఖాలీలు ఉంటే విద్యార్థులకు చదువు ఎక్కడ దొరుకుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు.. ప్రభుత్వంపై మండిపడ్డారు. ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులు ప్రయివేట్ పాఠశాలలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యలన్నింటిపైనా ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతుల గురిచేసేలా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రంలో అప్రజాస్వమ్య పరిస్థితులు తలెత్తాయని అన్నారు.

ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఉద్యోగాన్ని కోల్పోయిన నీ కూతురు కవిత పరిస్థితిని కొన్ని రోజులు కూడా భరించలేకపోయావు..  ఓడిపోయిన కవితకు నిరుద్యోగ సమస్య ఉందని గుర్తించి వెంటనే ఎమ్మెల్సీ ద్వారా ఆమె నిరుద్యోగ సమస్యను తీర్చారని ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి భట్టి వ్యగ్యంగా ఎద్దేవా చేశారు.

కేసీఆర్ పాలనలో నిరుద్యోగుల యువత తీవ్ర నిరాశా నిస్ప్రుహల్లో ఉన్నారని భట్టి చెప్పారు. ఇదే నిరుద్యోగ యువతీ యువకులు రాష్ట్ర ప్రభుత్వం మీద తిరగుబాటు మొదలుపెడితే.. ప్రజాస్వామ్య ఉనికికే అత్యంత ప్రమాదకరంగా మారుతుందని భట్టి విక్రమార్క తీవ్రహెచ్చరికలు జారీ చేశారు.

తెలంగాణలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలతో పాటు.. ఆనాడు ఎన్నికల ముందు చెప్పిన విధంగా ఇంటికో ఉద్యోగం వెంటనే ఇచ్చేలా  నియామకాలు చేపట్టాలని భట్టి డిమాండ్ చేశారు.

ఈ ఉద్యోగాల భర్తీ జరిగేంత వరకూ.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొన్ని ఉద్యోగాల ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి.. దీనిని కూడా మేము నమ్మమని భట్టి చెప్పారు. గతంలో 16 వేల కానిస్టేబుళ్ల రిక్రూట్ మెంట్ తరువాత.. ఇప్పటివరకూ వాళ్లను ట్రైనింగ్ కు పంపలేదని భట్టి చెప్పారు.