1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 జనవరి 2022 (17:07 IST)

బీజేపీ బలపడటాన్ని తెరాస ఓర్చుకోలేకపోతోంది : విజయశాంతి

తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రోజురోజుకూ బలపడటాన్ని అధికార తెరాస పార్టీ నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారంటూ బీజేపీ మహిళా నేత, సినీ నటి విజయశాంతి అన్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ వాహనంపై దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని ఖండించిన బీజేపీ నేతలు పోలీసులతో పాటు.. తెరాస ప్రభుత్వ వైఫల్యాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. 
 
ఇదే అంశంపై విజయశాంతి మాట్లాడుతూ, తెలంగాణాలో బీజేపీ నానాటికీ బలపడటాన్ని చూసి ఓర్వలేని తెరాస ప్రభుత్వం రాజకీయంగా ఎదిరించలేక గూండా రాజకీయాలకు తెరతీస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులకు తెగబడటం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. 
 
ఒక పార్లమెంట్ సభ్యుడికి భద్రత కల్పించలేని పోలీసులు రాష్ట్రంలో ఉంటే ఎంత.. లేకుంటే ఎంత? అంటూ ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో తెరాస నేతల తెరాస గూండాల అరాచకాలు నానాటికీ పెరిగిపోతున్నాయని, పోలీసులు అధికారులు మాత్రం చోద్యం చూస్తూ మీనమేషాలు లెక్కిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ దగాకోరు పాలన సాగిస్తున్నారంటూ మండిపడ్డారు.