గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 జూన్ 2020 (13:06 IST)

విద్యుత్ తీగలపై నడుచుకుంటూ వెళ్లి చెట్ల కొమ్మలు తొలగించిన యువకుడు

ఓ యువకుడు చేసిన సాహసానికి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతుండగా విద్యుత్ శాఖ అధికారుల వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. ఇలాంటి కొమ్మలు కొన్ని విద్యుత్ తీగలపై కూడా కూడాపడ్డాయి. 
 
ఈ కొమ్మలను తొలగించేందుకు ఓ విద్యుత్ ఉద్యోగి సాహసం చేశాడు. ఎలాంటి రక్షణ చర్యలు లేకుండానే విద్యుత్‌ తీగలపై నడుచుకుంటూ వెళ్లి ఆ చెట్టు కొమ్మను తొలిగించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు తమ స్మార్ట్‌ఫోన్‌లలో చిత్రీకరించిన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది వైరల్ అయింది. 
 
ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నిజాంపూర్‌లో చోటుచేసుకుంది. విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగి చేసిన ఈ సాహసం పట్ల అధికారులు ఆగ్రహం వ్యక్తం చేయగా, ప్రజలు మాత్రం అధికారులపై మండిపడుతున్నారు. ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో అతడికి ఏ ప్రమాదమూ జరగలేదు. అతడు విద్యుత్‌ తీగతలపై నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.