1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2020 (13:52 IST)

'మహానటి'కి మరో గోల్డెన్ ఛాన్స్? విజయ నిర్మల పాత్రలో...

తెలుగు చిత్ర పరిశ్రమలో తన అద్భుత నటనతో "మహానటి"గా గుర్తింపు పొందిన హీరోయిన్ కీర్తి సురేష్. ఈమె అలనాటి నటి సావిత్రి పాత్రను పోషించి, ఆ పాత్రలో జీవించింది. 'మహానటి' పేరుతో వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్. అలాగే, ఈ చిత్రంలో కీర్తి సురేష్ పోషించిన సావిత్రి పాత్రకు గాను ఎన్నో అవార్డులు వచ్చాయి. 
 
తాజాగా కీర్తి గురించి మరో వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఆమెకు మరో బయోపిక్‌లో నటించే అవకాశం వచ్చిందనేదే ఆ వార్త. ప్రముఖ నటి, సూపర్ స్టార్ కృష్ణ అర్థాంగి, దివంగత విజయనిర్మల జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో నటించే అవకాశం కీర్తి సురేష్‌కు వరించందట. తన తల్లి బయోపిక్ మూవీలో నటించాల్సిందిగా కీర్తి సురేష్‌ను ఆమె తనయుడు, నటుడు నరేష్ కోరినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
తెలుగు సినీ పరిశ్రమలో విజయనిర్మలది ఒక ప్రత్యేకమైన ప్రస్థానం. హీరోయిన్, దర్శకురాలు, నిర్మాతగా ఆమె తనదైన ముద్ర వేశారు. ఆమె బయోపిక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని... ఆమె పాత్రకు కీర్తి అయితేనే పూర్తి న్యాయం చేస్తుందనే నమ్మకంతో ఉన్నారట. అయితే, 'మహానటి' తర్వాత మరో బయోపిక్ చేయనని కీర్తి సురేశ్ ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో, కీర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.