బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

థియేటర్‌లో మాస్కులు తీయకుండా సినిమా చూడాలని పవన్ చెప్పారు...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం వకీల్ సాబ్. వేణుశ్రీరామ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్‌లు నిర్మించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 
 
ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర దర్శక నిర్మాతలు వేణు శ్రీరామ్‌, దిల్‌రాజుతోపాటు హీరోయిన్స్‌ అంజలి, అనన్య నగరంలోని ఓ థియేటర్‌లో సందడి చేశారు. ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. అనంతరం దిల్‌రాజు మాట్లాడుతూ..'ప్రేక్షకులతో కలిసి సినిమా చూసేందుకు వెళ్తున్నామని పవన్‌కల్యాణ్‌కి చెప్పాం. దాంతో మీ అందరికీ ఓ విజ్ఞప్తి చేయమని ఆయన తెలిపారు. 
 
‘బయట పరిస్థితులు అస్సలు బాలేదు.. కాబట్టి దయచేసి సినిమాకి వచ్చేటప్పుడు అందరూ మాస్క్‌లతో రండి. అలాగే సినిమా చూస్తున్న సమయంలోనూ మాస్క్‌ని తీయకండి. జాగ్రత్తగా ఉండండి' అని పవన్‌ మీకు ప్రత్యేకంగా చెప్పమని చెప్పారు’’ అని దిల్‌రాజు వివరించారు. 
 
అంతేకాకుండా సినిమా విజయం సాధించిన సందర్భంగా త్వరలోనే ‘వకీల్‌సాబ్‌ మీట్‌’ పేరుతో హైదరాబాద్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు దిల్‌రాజు తెలిపారు. దానికి పవన్‌ కల్యాణ్‌ వస్తున్నారని చెప్పారు.
 
‘వకీల్‌సాబ్‌’ చిత్రం హిట్‌ అందుకున్న సందర్భంగా వేణు శ్రీరామ్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులోభాగంగా తన అభిమాన హీరోతో కలిసి పనిచేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ‘వకీల్‌సాబ్‌’ కంటే ముందే తాను పవన్‌తో కలిసి పనిచేశానని తెలిపారు. 
 
‘ఓ శీతలపానియం యాడ్‌ షూట్‌లో భాగంగా పవన్‌కల్యాణ్‌తో కలిసి మొదటిసారి పనిచేశాను. ఆ వాణిజ్య ప్రకటనను ఓ బాలీవుడ్‌ దర్శకుడు డైరెక్ట్‌ చేశారు. ఆ డైరెక్టర్‌కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కావాలంటే నేను వెళ్లాను. అలా, మొదటిసారి పవన్‌ని దగ్గరగా చూశాను. కానీ మాట్లాడలేదు. ‘వకీల్‌సాబ్’ సినిమా కోసం మొదటిసారి పవన్‌ని కలిసినప్పుడు.. నాకెంతో ఆనందంగా అనిపించింది’ అని వేణు శ్రీరామ్‌ తెలిపారు.