శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 అక్టోబరు 2020 (10:13 IST)

దెబ్బకు తోకముడిచిన పాయల్ ఘోష్... రిచాకు భేషరతు క్షమాపణ!

బాలీవుడ్ నటి రిచా చద్దా దెబ్బకు మరో బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ తోకముడిచింది. కోర్టులో భేషరతు క్షమాపణ చెపుతూ, తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంది. దీంతో పాయల్ ఘోష్‌పై రిచా చద్దా వేసిన పరువు నష్టం దావాను వెనక్కి తీసుకుంది. ఇంతకీ వీరిద్దరి మధ్య ఎందుకు గొడవ జరిగిందో ఓ సారి పరిశీలిద్ధాం. 
 
బాలీవుడ్ నటి రిచా చద్దాపై తీవ్ర ఆరోపణలు చేసిన మరోనటి పాయల్ ఘోష్ తన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేసింది. తన స్టేట్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు కోర్టుకు తెలపడంతో ఆమెపై రిచా చద్దా వేసిన రూ. 1.1 కోట్ల పరువునష్టం దావాను వెనక్కి తీసుకుంది.
 
ఇటీవల ఓ తెలుగు చానల్‌కు పాయిల్ ఘోష్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ సమయంలో పాయల్ మాట్లాడుతూ, బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్‌పై అత్యాచార ఆరోపణలు చేసింది. అంతేకాక, రిచా చద్దా, మహీ గిల్, హ్యుమా ఖురేషీ వంటి వారి పేర్లను కూడా తెరపైకి తీసుకొచ్చింది.
 
ఈ హీరోయిన్లు చాలా సాదాసీదాగా కనిపించినా కశ్యప్ వారికి అవకాశాలు ఇస్తున్నాడంటే అందులో ఉన్న మర్మమేంటో అర్థం చేసుకోవచ్చని, సాధారణంగా ఇలా నామమాత్రపు అందంతో కనిపించే వారికి దర్శకులు సలహాలు ఇవ్వరని పేర్కొంది. 
 
వారికి అవకాశాలు ఇస్తుండడం వెనుక ఉన్న మతలబు అందరికీ తెలిసిందేనని నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది. రిచా తనకు కేవలం ఒక్క ఫోన్‌కాల్ దూరంలో ఉంటుందని అనురాగ్ తనతో చెప్పినట్టు పేర్కొంది.
 
ఈ వ్యాఖ్యలను ఇద్దరు హీరోయిన్లు సీరియస్‌గా తీసుకోలేదు. కానీ, రిచా చద్దా మాత్రం తీవ్రంగా పరిగణించింది. తనపై ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిందంటూ సదరు నటిపై బాంబే హైకోర్టును ఆశ్రయించి రూ.1.1 కోట్ల పరువునష్టం దావా వేసింది.
 
ఈ పిటిషన్‌పై బుధవారం విచారణకు జరుగగా, తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పి, స్టేట్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు పాయల్ తరపు న్యాయవాది నితిన్ సత్పుటే తెలిపారు.
 
రిచాకు తన క్లయింట్ పెద్ద అభిమాని అని, ఆమెను గౌరవిస్తుందని పేర్కొన్నారు. రిచాను అప్రతిష్ఠపాలు చేయాలనుకోవడం ఆమె ఉద్దేశం కాదని, తన స్టేట్‌మెంట్‌ను వెనక్కి తీసుకోవడంతోపాటు బేషరతు క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్టు కోర్టుకు తెలిపారు.
 
దీంతో స్పందించిన రిచా తరపు న్యాయవాదులు వీరేందర్ తుల్జాపూర్కర్, సవీనా బేడీ సచార్‌లు పాయల్ క్షమాపణలను అంగీకరిస్తున్నామని, దావాను వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది.