శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 నవంబరు 2020 (15:42 IST)

రాజకీయాల్లోకి వర్మ 'రంగేలి' హీరోయిన్ - కంగనాకు కౌంటర్ ఇచ్చేందుకేనా?

టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన చిత్రం 'రంగేలి'. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఊర్మిలా మతోండ్కర్ నటించింది. ఈ ఒక్క చిత్రంలో ఈమె దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. ఆ తర్వాత ఆమె అనేక చిత్రాల్లో నటించినప్పటికీ.. రంగేలి చిత్రం మాత్రం ఆమె కెరీర్‌లో చిరస్థాయిగా గుర్తుండిపోయేలా చేసింది. 
 
ఈ క్రమంలో ఊర్మిళ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. ఆమె మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన పార్టీలో చేరనున్నారు. ఈమెను ఏకంగా ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మొత్తం 12 మందిని మహారాష్ట్ర సర్కారు నామినేట్ చేస్తుండగా, అందులో ఈమె పేరు కూడా ఉన్నట్టు వినికిడి. 
 
ఈ నేపథ్యంలో శివసేనలోకి ఊర్మిళ ఎంట్రీపై ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ, ఊర్మిళ రేపు శివసేన పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రకటించారు. కొన్ని నెలలుగా శివసేనను లక్ష్యంగా చేసుకుని హీరోయిన్ కంగన రనౌత్‌ తీవ్ర విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఆమె చేస్తోన్న వ్యాఖ్యలకు ఎప్పటికప్పుడు ధీటుగా కౌంటర్ ఇప్పించడానికే ఊర్మిళను శివసేన నేతలు తమ పార్టీలో చేర్చుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె గతంలో కాంగ్రెస్‌ పార్టీలో పనిచేసిన విషయం తెలిసిందే.
 
కాగా, గతంలో ఊర్మిళ, కంగనా మధ్య పరస్పరం మాటల తూటాలు పేలిన విషయం తెలిసిందే. ముంబైను పాక్ ఆక్రమిత కాశ్మీర్‌గా అభివర్ణించిన కంగనా తీరుపై ఊర్మిళ గతంలో విమర్శలు చేసింది. దీంతో ఊర్మిళను సాఫ్ట్ పోర్న్‌స్టార్‌గా అభివర్ణిస్తూ కంగన వ్యాఖ్యలు చేసింది. ఇలా వీరిద్దరి మధ్య కొంతకాలం మాటల యుద్ధం సాగింది.