గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (10:42 IST)

మరో మహనీయుని బయోపిక్ ... దృశ్యకావ్యంగా దామోదరం సంజీవయ్య జీవిత చరిత్ర

ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1960వ సంవత్సరంలో పనిచేసిన దళిత నాయకులు దామోదరం సంజీవయ్య శతజయంతిని ప్రతి యేడాది ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకుంటారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొదటిసారి చివరిసారి దళితులు ముఖ్యమంత్రిగా ఉన్నది వీరు ఒక్కరే. కేంద్ర కార్మిక శాఖ మంత్రి గాను పరిశ్రమల శాఖ మంత్రిగాను అంతేగాక అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి రెండుసార్లు అధ్యక్షులుగా కూడా ఉన్నారు. 
 
ఎంతటి ఉన్నత పదవులు అలంకరించినా అతి సామాన్యంగానే వారి జీవితాన్ని కొనసాగించారు తప్ప ఎటువంటి హంగులు ఆర్భాటాలకు వారు చోటివ్వలేదు. ఉన్నత పదవులు అధిరోహించినా కూడా అతి నిరాడంబరుడు. ముఖ్యంగా నేటి రాజకీయ నాయకులకు ఒక మార్గదర్శి. వారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరు లక్షల ఎకరాలు బంజరు భూమి పేదలకు పంచిపెట్టారు. వారి హయాంలో అవినీతి నిరోధక శాఖ, ఉచిత నిర్బంధ విద్యను, దళిత బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. ఆయన మరణించేనాటికి సొంత ఇల్లు గాని, సెంటు భూమి గాని, బ్యాంకు బాలన్స్‌గాని లేవు.
 
సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో కన్నతల్లి ఒక పూరి ఇంట్లో నివసించారంటే అతిశయోక్తి కాదు. అసెంబ్లీకి కారులో కాకుండా రిక్షాలో వెళ్లే వారంటే ఈ తరం వారికి నమ్మశక్యం కాదు. అటువంటి అతి సామాన్య ప్రజా నాయకుడు అయినటువంటి దామోదరం సంజీవయ్య జీవిత విశేషాలు ఇప్పటితరానికి తెలియజేయాలని, సమసమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ వారిని ఆదర్శంగా తీసుకోవాలి అనే తలంపుతో "దామోదరం సంజీవయ్య" (ఆదర్శప్రాయుడు అనే ట్యాగ్‌తో) బయోపిక్ సినిమా నిర్మితంకానుంది. ఈ చిత్రాన్ని సాంధ్యశ్రీ సినిమా క్రియేషన్స్ అనే సొంత సినిమా బ్యానర్‌పై చెన్నైలోని ద్రావిడదేశం అధ్యక్షుడు వి.కృష్ణారావు నిర్మించనున్నారు. 
 
సినిమా దర్శకత్వశాఖలో గతంలో ఎంతో అనుభవం గడించిన కృష్ణారావు... దామోదరం సంజీవయ్య పాత్రకు ఒక సీనియర్ కథానాయకుడితో త్వరలో చర్చించ పోతున్నామ వెల్లడించారు. ఈ చిత్రాన్ని రెండు షెడ్యూల్లో పూర్తి చేయబోతున్నారు. సామాజిక స్పృహ ఉన్న ఒక మంచి దర్శకునికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించి తాను కూడా సహ దర్శకత్వం వహిస్తున్నట్లు కృష్ణారావు తెలియజేశారు.