1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 అక్టోబరు 2020 (15:17 IST)

ఉషా కిరణాల రాకతో హైదరాబాద్ ఆకాశం వెలిగిపోతోంది.. కంగనా రనౌత్

భాగ్య నగరి అందాలకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఫిదా అయిపోయింది. ఉషా కిరణాల రాకతో హైదరాబాద్ ఆకాశం వెలిగిపోతోంది అంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా, ఈ నగర వాతావరణాన్ని ఎంతగానో ఆస్వాదిస్తున్నట్టు పేర్కొంది. 
 
ప్రస్తుతం ఈమె జయలలిత బయోపిక్‌లో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ కోసం ఆమె హైదరాబాద్ నగరానికి వచ్చారు. షూటింగ్ జరుగుతున్న రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంటున్న ఆమె... ప్రత్యేకంగా వేసిన అసెంబ్లీ సెట్‌లో కంగనాపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. 
 
అయితే, హైదరాబాద్ వాతావరణంపై కంగనా ప్రత్యేకంగా స్పందించారు. హైదరాబాద్ ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉందని కితాబిచ్చారు. హిమాలయాల్లో కరిగిన శరద్ ఋతువు ఇక్కడ శీతాకాలంగా మారిందా అన్నట్టుగా ఉందని అభివర్ణించారు. 
 
ఉషా కిరణాల రాకతో హైదరాబాద్ ఆకాశం వెలిగిపోతుందని, లేత చలిగాలుల్లో ఉదయ భానుడి వెచ్చదనం కలగలసి మొత్తానికి ఓ మత్తులోకి తీసుకెళుతుందని కంగనా కవితాత్మకంగా ట్వీట్ చేశారు.
 
ఇకపోతే, ఇటీవల హాలీవుడ్ నటి సల్మాహయెక్ ఓ సంచలన ప్రకటన చేసింది. తాను హిందూ దేవత లక్ష్మీదేవిని ధ్యానిస్తానని ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భక్తి గురించి ఆమె మాట్లాడారు. 
 
మతం, జాతి అనే తేడా లేకుండా చాలా మంది రాముడిని ప్రేమిస్తారని తెలిపింది. ఎంతోమంది భగవద్గీతను అనుసరిస్తారని చెప్పారు. కానీ, మన దేశంలో మాత్రం కొంత మంది భక్తిని అపహాస్యం చేస్తున్నారని మండిపడింది. 
 
ఇక్కడ మనం భక్తిని ఎంచుకోవడం లేదని, భక్తే మనల్ని ఎంచుకుంటోందని చెప్పుకొచ్చింది. కంగనా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందనే వార్తలు వస్తున్న తరుణంలో... ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.