బెట్టింగుల యాప్ల వల్ల బాగుపడిన చరిత్ర లేదు.. ప్లీజ్ వాటి జోలికెళ్లొద్దు : సంపూర్ణేష్ (Video)
ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్లపై విపరీతమైన చర్చ సాగుతోంది. బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు సంపూర్ణేష్ బాబు ఈ బెట్టింగ్ యాప్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. బెట్టింగ్ యాప్లకు బానిసలైనవారు బాగుపడిన చరిత్ర లేదని, అందువల్ల వాటి జోలికి వెళ్లొద్దంటూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
ఈ వీడియోలో సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ, యువత బెట్టింగ్ యాప్లకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. బెట్టింగుల వల్ల బాగుపడినట్టు చరిత్రలోనే లేదన్నాడు. ఇలాంటి వాటికి బానిసలయ్యే ముందు ఇంట్లో వారి గురించి ఆలోచించాలని కోరాడు. బెట్టింగు యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు.
బెట్టింగ్ యాప్లపై తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన చర్చ సాగుతుందన్నారు బెట్టింగ్ యాప్ల ద్వారా లక్షల రూపాయలు సంపాదించవచ్చన్న సోషల్ మీడియా ప్రమోషన్లతో ఎంతో మంది వాటి బారినపడి లక్షల రూపాయలు నష్టపోతున్నారు. ఈ క్రమంలో కొందరు నష్టాలను భరించలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. దీంతో ఈ బెట్టింగ్ యాప్లపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పోరు ప్రారంభించారు. వాటికి దూరంగా ఉండాలని యువతకు పిలుపునిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారానికి తాను కాడా స్పందించి తన వంతుగా ఈ వీడియోను విడుదల చేస్తున్నట్టు తెలిపారు.