గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 అక్టోబరు 2021 (17:32 IST)

చిరంజీవి ఔదార్యం : అనారోగ్య వీరాభిమాని ప్రాణానికి భరోసా

మెగాస్టార్ చిరంజీవి మరోమారు తనలోని పెద్ద మనసును చాటుకున్నారు. విశాఖకు చెందిన ఓ వీరాభిమాని తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న చిరంజీవి చలించిపోయారు. తాను ఎంతగానో ఆరాధించే మెగాస్టార్ చిరంజీవిని కలవాలని, మాట్లాడాలని ఆ వీరాభిమాని భావించాడు. ఇదే విషయాన్ని ట్విట్టర్ లో వెలిబుచ్చాడు. 
 
ఈ విషయం ఇతర మెగా అభిమానులు చిరంజీవి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంకట్ తనను కలవొచ్చని తెలిపారు. కానీ వెంకట్ అనారోగ్యం కారణంగా బస్సు, రైలు ప్రయాణాలు చేసే పరిస్థితిలో లేకపోవడంతో, ఈ విషయం గుర్తించిన చిరంజీవి పెద్దమనసుతో వ్యవహరించారు. వెంకట్‌‍కు, ఆయన భార్య సుజాతకు విశాఖ నుంచి హైదరాబాదుకు విమాన ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు.
 
దీంతో శనివారం తన భార్యతో కలిసి హైదరాబాద్ వచ్చిన వెంకట్ తన ఆరాధ్య హీరో చిరంజీవిని ఆయన నివాసంలో కలిసి మురిసిపోయారు. తన ఇంటికి వచ్చిన వెంకట్ దంపతులతో చిరంజీవి ఆప్యాయంగా ముచ్చటించారు. వెంకట్ అనారోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 
 
వైద్య పరీక్షల కోసం హైదరాబాదులోని ఒమేగా ఆసుపత్రికి పంపించారు. మెడికల్ రిపోర్ట్స్‌పై ఒమేగా డాక్టర్లతో మాట్లాడారు. వెంకట్ విశాఖలో చికిత్స పొందవచ్చని, ఆసుపత్రి ఖర్చులను తానే భరిస్తానని ఈ సందర్భంగా చిరంజీవి భరోసా ఇచ్చారు.
 
మరింత మెరుగైన చికిత్స అవసరమైతే చెన్నై తరలించేందుకు అయినా తాను సిద్ధంగా ఉన్నానని, వెంకట్ వంటి అభిమానిని కాపాడుకోవడంలో రాజీపడబోనని చిరంజీవి స్పష్టం చేశారు.
 
 ఈ సందర్భంగా వెంకట్ ఆనందం అంతాఇంతా కాదు. చిరంజీవిని కలవాలన్న కల నెరవేరడం సంతోషదాయకం అనుకుంటే, తన అనారోగ్యానికి ఆయనే చికిత్స చేయిస్తానని ముందుకు రావడం అతడిని మరింత ఆనందానికి గురిచేసింది.