శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 నవంబరు 2020 (13:59 IST)

చిరంజీవిని కరోనా వైరస్ ఎక్కడ కాటేసిందబ్బా? ఆరా తీస్తున్న ఫ్యాన్స్!

టాలీవుడ్ అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవి కరోనా వైరస్ బారినపడ్డారు. "ఆచార్య" షూటింగులో పాల్గొనే నిమిత్తం ఆయన ముందుజాగ్రత్త చర్యలోభాగంగా కరోనా పరీక్ష చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. మరో 14 రోజుల పాటు ఆయన హోం క్వారంటైన్‌లో ఉండనున్నారు. 
 
నిజానికి కరోనా వైరస్ మానవాళిని కబళిస్తోందన్న వార్త ప్రపంచానికి తెలిసినప్పటి నుంచి చిరంజీవి చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. కరోనా వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం అనేక ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. అదేసమయంలో తాను పూర్తిగా ఇంటికే పరిమితమైపోయారు. అంటే గత మార్చి నెల నుంచి ఆయన ఇంట్లోనే గడుపుతున్నారు. ఎప్పుడైనా అత్యవసరం అనిపిస్తే తప్ప బయటికి రాలేదు. 
 
చివరకు లాక్డౌన్ సమయంలో సినీ కార్మికులకు సహాయం చేసే విషయంపై ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం చిరంజీవి ఇంట్లో జరుగగా, దీనికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడకే వచ్చారు. 
 
అంతేకాకుండా, ఏదైనా చాలా ముఖ్యమైన పని పడినపుడు మాత్రం వెళ్లి వెంటనే వచ్చేవారు. ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చిరంజీవిని కరోనా వైరస్ కాటేయడం ఇపుడు ప్రతి ఒక్కరూ ఆందోళనకు గురవుతున్నారు. పైగా, చిరంజీవికి ఎక్కడ వైరస్ సోకివుంటుందన్న దానిపై ఆరా తీస్తున్నారు. 
 
ఈ నెల 7వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో సహచర నటుడు నాగార్జునతో కలిసి చిరంజీవి కలిశారు. అక్కడ్నుంచి మెగాస్టార్‌కు కరోనా వచ్చిందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఆ అవకాశం తక్కువే. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దగ్గరికి వెళ్తున్నపుడు కనీస జాగ్రత్తలు ఖచ్చితంగా ఉంటాయి. తనిఖీలు కూడా అదేస్థాయిలోనే ఉంటాయి.
 
ఇక.. రెండో కారణం పరిశీలిస్తే, ఇటీవల టాలీవుడ్ సంగీత దర్శకుడు, సింగర్, నటుడు రఘు కుంచె కూతురు రాగ వివాహం హైదరాబాద్‌లోనే జరిగింది. దీనికి సినీ రాజకీయ ప్రముఖులు చాలా మంది వచ్చారు. అక్కడ ఎవరికీ మాస్కులు కనిపించలేదు.. భౌతిక దూరం మచ్చుకైనా కనిపించలేదు. ఆ వేడుకకు చిరంజీవి హాజరై, వధూవరులను ఆశీర్వదించి వచ్చారు. 
 
ఆ సమయంలో చిరంజీవి ఒక్కరే మాస్క్ పెట్టుకుని కనిపించారు. మిగిలిన వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా ముఖానికి మాస్క్ ధరించలేదు. పైగా చిరు వచ్చాడనే కంగారులో ప్రతి ఒక్కరూ ఎగబడ్డారు. ఆయన్ని చుట్టు ముట్టేసారు. దాంతో భౌతిక దూరం మాయమైపోయింది. 
 
ఎంత ప్రయత్నించినా కూడా రఘు కుంచె కూతురు పెళ్లిలో జనాల నుంచి మెగాస్టార్ బయటికి రావడానికి టైమ్ కూడా బాగానే తీసుకుంది. అక్కడే ఏదైనా జరిగిందా.. ఆ వైరస్ అక్కడే ఆయన శరీరంలోకి వచ్చుంటుందా అనే అనుమానిస్తున్నారు.
 
అదేసమయంలో చిరంజీవికి కరోనా పాజిటివ్ అని ఫలితాల్లో తేలినప్పటికీ.. ఆయనలో మాత్రం ఎక్కడా కరోనా లక్షణాలు ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించలేదు. దీనికి కారణం.. చిరంజీవి ప్రతిరోజూ జిమ్‌లో ఎక్కువ సమయం గడుపుతుంటారు. దాంతో పాటు పౌష్టికాహారాన్నే తీసుకుంటున్నారు. 
 
అన్నింటికీ మించి కరోనా జాగ్రత్తలను పాటిస్తున్నాడు. దాంతో బాడీలోకి వైరస్ వచ్చినా కూడా టెస్ట్ చేయించుకునే వరకు ఆయనకు కూడా తెలియలేదు. వచ్చిన దారిలోనే వైరస్ పోతుందని ఆయన చెప్తున్నాడు. తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఏదేమైనా కూడా చిరుకు కరోనా వచ్చిన తర్వాత మిగిలిన హీరోలు భయపడుతున్నారు.