1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 17 జనవరి 2023 (19:31 IST)

చిరంజీవి సినిమాకు బాలకృష్ణ ఫేవర్‌ చేశాడా!

balakrishna-chiru posters
balakrishna-chiru posters
సంక్రాంతి పండుగకు అగ్రహీరోల సినిమాలు విడుదల చేయాలంటే ఆచితూచి అడుగులు వేసేవారు. అప్పట్లో హీరోల మధ్య పోటీ వుండేది. ఈసారి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు ఒకేసారి పండుగనాడు విడుదలయ్యాయి. ఒక్క రోజు తేడా వుండడం ప్రత్యేకత. అసలు ఈ రెండు సినిమాల నిర్మాతలు ఒకరే కావడం మరో విశేషం. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్‌ వారు బాలకృష్ణ సినిమాను డిసెంబర్‌లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అందుకు బాలకృష్ణ అంగీకరించకపోవడంతో సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. లోపల  నిర్మాతల్లో తెలీని బాధ వున్నా పైకి మాత్రం మా బేనర్‌లో వస్తున్న రెండు సినిమాలు బ్లాక్‌ బస్టర్‌ అవుతాయని నమ్మకంగా చెప్పారు. ఈ అగ్రహీరోల సినిమాల ధాటికి తమిళ విజయ్‌ సినిమా వారసుడు బలవంతంగా జనవరి 14వ తేదీకి మార్చాల్సి వచ్చింది. ఈ విషయమై దిల్‌రాజు ముందునుంచి మడమతిప్పను అనుకున్నట్లుగా జనవరి 11నే వస్తున్నానంటూ చెప్పిన వ్యక్తి ఆ తర్వాత ఛాంబర్‌ చొరవతో వెనకడుగువేయాల్సి వచ్చింది.
 
వీరసింహారెడ్డి విడుదల అయిన రోజునాడే సాయంత్రానికి నిర్మాతలు ప్రమోషన్‌ ఏర్పాటు చేశారు. అందరూ బాగుందంటూ రకరకాలుగా చెబుతున్నారు. బాలకృష్ణ మాత్రం ఈ కథ కొత్త సీసాలో పాతనీరు అని బాహాటంగానే చెప్పేశారు. అన్న, చెల్లెలు సెంటిమెంట్‌ నాన్నగారు చేసిన రక్తసంబంధం అంటూ రెండు, మూడు సినిమాల పేర్లు చెప్పారు. క్లయిమాక్స్‌లో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ చనిపోవడం అందరిని ఏడిపించిందని అన్నారు.
 
ఇక ఆ తర్వాత రోజు వాల్తేరు వీరయ్య ప్రమోషన్‌ కూడా చేశారు. సహజంగా విడుదలయి సక్సెస్‌ బాటలో వుంటే మీడియాకు దూరంగా వుండడం అనేది ఒక రివాజు. కానీ ఈ రెండు సినిమాలకు అలా జరగలేదు. కారణం. సంక్రాంతినాడు రెండు అగ్రహీరోల సినిమాలు విడుదల కావడంతో ప్రేక్షకులను కోడిపందాలు, పండగ వాతావరణం నుంచి థియేటర్‌కు తీసుకురావడం కారణమని ట్రేడ్‌ వర్గాలు విశ్లేషించాయి. బాలకృష్ణ కావాలని సంక్రాంతి రావడంతో ఒకరకంగా పోటీకి వచ్చినా చిరంజీవికి లాభం చేకూర్చేలా చేశాడని తెలుస్తోంది. చిరంజీవి సినిమాలో ఎంటర్‌టైన్‌ చేసే అంశాలున్నాయి. బాలయ్య సినిమాలో కేవలం హింస. నో వినోదం. దాంతో పండుగనాడు పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో ప్రేక్షకులు తప్పనిసరిగా చూడాల్సివచ్చిందని తెలుస్తోంది. 
 
విశేషం ఏమంటే, రెండు సినిమాలను విడుదల రోజు తెల్లవారుజామున 4.30గంటలకు కొన్ని చోట్ల ప్రదర్శించారు. దాంతో మార్నింగ్‌ షోకు జనాలు చాలాచోట్ల పలచగా వున్నారు. అయినా హౌస్‌ఫుల్‌ బోర్డులు కనిపించాయి. ఇది రొటీన్‌ జిమ్మిక్కు అని ఇండస్ట్రీవర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ఈ రెండు సినిమాలు పండుగనాడు కాకుండా మిగిలిన రోజుల్లో విడుదలయితే అంత సక్సెస్‌ అయ్యేవికావనే టాక్‌ ప్రబలంగా ఫిలింనగర్‌లో వినిపిస్తోంది.