గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: ఆదివారం, 9 ఆగస్టు 2020 (15:37 IST)

“గ్రీన్ ఇండియా ఛాలెంజ్” అద్భుతమైన కార్యక్రమం : ప్రిన్స్ మహేష్ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన జన్మదినం పురస్కరించుకొని  గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఫిలింనగర్ లోని తన నివాసంలో మొక్కలు నాటారు. అనంతరం మహేశ్ బాబు మాట్లాడుతూ.. ఈ భూమి మీద నివశించే హక్కు మనుషులకి ఎంతుందో.. మొక్కలకి, జంతువులకి అంతే ఉంది.
 
అన్ని జీవ జాలాల్ని సమానంగా చూడటమే నాగరికత అన్నారు పెద్దలు. కానీ మనం మాత్రం బంగళాలు కట్టడం, అడవుల్ని నరికి భూమిని నిస్సారం చేసే ఎరువుల్ని వాడి అభివృద్ధి, నాగరికత అనుకుంటుంన్నాం. అందుకే ఇన్ని విపత్తులు సంభవిస్తున్నాయి. నా దృష్టిలో నిజమైన అభివృద్ధి అంటే మనుషులతో పాటే వృక్షాల ఎదుగుదల కూడా. 
 
అప్పుడే మనం విపత్తులు లేకుండా, కరోనా లాంటి మహమ్మారులు లేకుండా నిశ్చింతంగా బ్రతకగలం. ఇది జరగాలంటే ప్రతీ ఒక్కరు మన జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో పాల్గొనాలి, బాధ్యతగా మూడు మొక్కలు నాటాలి. ముగ్గురిని కాదు ప్రతీ ఒక్కరు ముప్పైమందిని కదిలించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.
 ఇది ఛాలెంజ్ అనే కంటే భవిష్యత్ తరాల మనుగడకు ప్రొటెక్షన్ ప్లాన్ అంటే ఇంకా బావుంటుందని నా పర్సనల్ ఫీలింగ్.

 
ఎందుకంటే నాదీ, నీది అని కుచించుకుపోయిన సమాజంలో ఇంత ఉదాత్తమైన కార్యక్రమాన్ని తీసుకొని ఇంతమందిని కదిలించడం అంటే మాములు విషయం కాదు. అందుకు సంతోష్ కుమార్ గారిని మనసారా అభినందిస్తున్నా.. వారి కృషికి మద్దతుగా నా అభిమానులందరు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” స్వీకరించి మొక్కలు నాటాలని కోరుతూ, మరో ముగ్గురు ప్రముఖ నటులు జూనియర్ ఎన్టీఆర్, తమిళ్ నటుడు విజయ్, నటి శృతి హాసన్‌లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.