1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 ఆగస్టు 2022 (10:12 IST)

మహేష్ బాబు పుట్టిన రోజు.. ఆయన కొనిన తొలి ఫోన్ ఇదే..

Mahesh Babu
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు పుట్టిన రోజు నేడు. ఒక్కడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు వంటి హిట్ సినిమాలు సాధించి.. అభిమానుల గుండెల్లో పండుగాడయ్యాడు. అమ్మాయిల కలల రాజకుమారుడయ్యాడు. 
 
తండ్రి వేలు పట్టుకొని చిన్ననాటే ఎలాంటి బెరుకు లేకుండా.. కెమెరా ముందుకొచ్చిన యువరాజు.. నాలుగు పదుల వయసులోనూ పాలుగారే పసితనపు పసిమిఛాయతో మెరిసిపోతున్న అతడ్ని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. తండ్రి సూపర్ స్టార్ డమ్‌ను, ఆయన లెగసీని కొనసాగిస్తోన్న ఆ ప్రిన్స్ పుట్టినరోజు నేడు.
 
మహేశ్ బాబు 1975, ఆగస్ట్ 9న మద్రాస్‌లో జన్మించాడు. అప్పటికే తండ్రి కృష్ణ శత చిత్రాలు పూర్తి చేసి ఇండస్ట్రీలో హీరోగా జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు. చిన్నప్పటి నుంచి తండ్రితో తిరిగి సినిమా వాతావరణం చూసిన మహేశ్.. అన్న రమేశ్ బాబుతో కలిసి 'నీడ' చిత్రంతో వెండితెరపై మొదటిసారిగా కనిపించాడు. ఆ తర్వాత తండ్రి నటించిన 'పోరాటం' చిత్రంతో బాలనటుడిగా సినీ రంగప్రవేశం చేశాడు. 
 
తొలి చిత్రంతోనే శభాష్ అనిపించుకున్నాడు మహేశ్ బాబు. ఆ తర్వాత బాలనటుడిగా, తండ్రితో కలసి పలు చిత్రాల్లో నటించి.. నటనలోని మెళకువల్ని ఆ వయసులోనే ఒడిసిపట్టాడు. కొడుకు దిద్దిన కాపురం, గూఢచారి 117, శంఖారావం, బాలచంద్రుడు, అన్నతమ్ముడు, ముగ్గురు కొడుకులు లాంటి చిత్రాల్లో నటించి అభిమానుల్ని మెప్పించాడు. అతడి చదువు పాడవకూడదనే ఉద్దేశంతో కొంతకాలం మహేశ్ బాబును కెమేరా ముందుకు రానివ్వలేదు కృష్ణ.
 
1999 లో 'రాజకుమారుడు' చిత్రంతో మహేశ్ బాబు హీరోగా సినీరంగ ప్రవేశం చేశాడు. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ కైవసం చేసుకున్నాడు. మహేశ్ కెరీర్‌ను అద్భుతమైన మలుపు తిప్పిన చిత్రం 'మురారి' (Murari). అందులోని వైవిధ్యమైన అతడి నటనకు అభిమానులు మురిసిపోయారు. 
 
ఇక అతడికి యాక్షన్ హీరోగా మంచి బ్రేక్‌నిచ్చిన చిత్రం 'ఒక్కడు'. ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసి.. తిరుగులేని స్టార్ అయ్యాడు మహేశ్. కొన్ని విషయాల్లో తండ్రిని అనుసరించిన మహేశ్.. మరికొన్ని చోట్ల తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. 
 
'నిజం' చిత్రంతో ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్న మహేశ్ బాబు.. ఆ తర్వాత 'అతడు, దూకుడు, శ్రీమంతుడు' చిత్రాలకుగాను ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. మురారి, ఒక్కడు, అతడు, పోకిరి చిత్రాలు సిల్వర్ జూబిలీ జరుపుకున్నాయి. 'శ్రీమంతుడు' రజతోత్సవం చేసుకుంది.
 
తండ్రి లాగానే మహేశ్ బాబు నిర్మాతగా మారాడు. ఆయన నిర్మాణ భాగస్వామిగా జీయమ్బీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన 'శ్రీమంతుడు' చిత్రం సూపర్ హిట్టయింది.
 
ఆ తర్వాత 'బ్రహ్మోత్సవం, సరిలేరు నీకెవ్వురు, సర్కారువారి పాట' లాంటి సినిమాలతోనూ నిర్మాణ భాగస్వామి అయ్యాడు. అడివి శేష్ హీరోగా మేజర్ నిర్మించగా అది అద్భుతమైన రీతిలో ప్రేక్షకాదరణను పొందింది. 
 
ఇక మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 9న ప్రపంచ వ్యాప్తంగా 175 స్క్రీన్స్‌లో 4K ఫార్మెట్‌లో 'పోకిరి' చిత్రం మరోసారి అభిమానుల ముందుకొచ్చింది. దీనికి అద్భుతమైన స్పందన లభించింది.
 
విశేషాలు 
మహేశ్ బాబు కొన్న ఫోన్.. నోకియా క్లాసికల్ మోడల్ (కీ ప్యాడ్). తన తండ్రి కృష్ణతోనే సెల్ఫీ దిగేందుకు ఇష్టపడతారు. పలు బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా పనిచేసి ఆయన హీల్ ఏ చైల్డ్ అనే స్వచ్ఛంధ సంస్థకూ గుడ్ విల్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. 
 
ఇక సోషల్ మీడియాలో మహేష్ బాబుకు క్రేజ్ అంతా ఇంతా కాదు. ట్విట్టర్‌లో మహేష్ అనుసరిస్తున్న వారి సంఖ్య 12.7 మిలియన్‌కి పైగా. ఇన్‌స్టాగ్రామ్..  8.7మిలియన్‌కి పైగా.