శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 31 మార్చి 2021 (10:25 IST)

'వకీల్ సాబ్‌'కు ప్రీరిలీజ్ ఈవెంట్‌కు బ్రేక్ వేసిన పోలీసులు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'వకీల్ సాబ్'. ముగ్గురు హీరోయిన్లు నటించారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించగా, ఏప్రిల్ 9వ తేదీన ఈ చిత్రం విడుదలకానుంది. అయితే, దీనికింటే ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసులు అడ్డుకట్ట వేశారు. ఈ ఈవెంట్ నిర్వహణకు అనుమతి నిరాకరించారు. ఈ విషయాన్ని జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు.
 
కాగా, వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను యూసుఫ్‌గూడలోని పోలీస్ లైన్స్‌లోని స్పోర్ట్స్ గ్రౌండ్స్‌లో ఏప్రిల్ 3న నిర్వహించాలని ప్లాన్ చేశారు. దీనికి అనుమతి కోరుతూ జె.మీడియా పోలీసులకు లేఖ రాసింది. ఈ ఫంక్షన్‌కు 5 నుంచి 6 వేల మంది హాజరవుతారని ఆ లేఖలో నిర్వాహకులు పేర్కొన్నారు.
 
అయితే, రాష్ట్రంలో కరోనా మళ్లీ చెలరేగుతున్న నేపథ్యంలో సభలు, సమావేశాలకు అనుమతులు లేవని చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ‘వకీల్‌సాబ్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించడంతో పవన్ అభిమానులు నిరాశలో మునిగిపోయారు.