1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 ఏప్రియల్ 2020 (09:36 IST)

మద్యంలేక నిద్రమాత్రలు మింగిన నటి కుమారుడు ... ఆస్పత్రిపాలు... ఎక్కడ?

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా కేంద్రం లాక్‌డౌన్ అమల్లోకి తెచ్చింది. దీంతో ప్రస్తుతం దేశంలో కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మందుల షాపులు, కిరాణాషాపులు, పెట్రోల్ బంకులు, ఆస్పత్రులు మాత్రమే తెరిచివుంచారు. 
 
అయితే, లాక్‌డౌన్ కారణంగా మద్యంషాపులు సంపూర్ణంగా మూసివేశారు. దీంతో తాగుబోతుల పరిస్థితి విచిత్రంగా మారిపోయింది. అనేక మంది తాగుబోతులు మద్యం లభించక బలవన్మరణాలకు పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి మరణాలను కట్టడి చేసేందుకు కేరళ ప్రభుత్వం వైద్యుల ప్రిస్కిప్షన్ ఉంటే మద్యం సరఫరా చేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. కానీ, ఈ ఆదేశాలను కేరళ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అలాగే, వివిధ ప్రాంతాల్లో మద్యంబాబులు వివిధ రకాలైన సంఘటనలు ఎదుర్కొంటున్నారు.
 
ఈ నేపథ్యంలో తాజాగా, కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి మనోరమ కుమారుడు మద్యం లేక నిద్రమాత్రలు మింగి ఇపుడు ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటన కోలీవుడ్‌లో సంచలనం రేపింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అనేక భాషల్లో వేలాది చిత్రాల్లో నటించిన దక్షిణాది సినీ నటి దివంగత మనోరమ. ఈమె కుమారుడు భూపతి నిద్రమాత్రలు అతిగా వేసుకుని, ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటన చెన్నైలోని టినగర్ ప్రాంతంలో కలకలం రేపింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక నీలకంఠ మెహతా వీధిలో తన కుటుంబ సభ్యులతో కలిసి భూపతి నివసిస్తున్నారు. ఈయనకు నిత్యం మద్యంసేవించే అలవాటు ఉంది. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌‌డౌన్‌ అమలవుతున్న కారణంగా మద్యం దుకాణాలు మూతపడటంతో మద్యంలేక పోవడంతో భూపతికి పిచ్చిపట్టినట్టు అయింది. దీంతో భూపతి నిద్రమాత్రలు మింగడంతో అస్వస్థతకు గురయ్యాడు. 
 
అయితే, భూపతి అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన కుటుంబీకులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. జరిగిన ఘటనపై వివరణ ఇచ్చిన భూపతి కుమారుడు రాజరాజన్‌, తన తండ్రిని హాస్పిటల్‌లో చేర్చిన విషయం నిజమేనని స్పష్టం చేశారు. 
 
మద్యం తాగే అలవాటున్న ఆయన, మత్తు కోసమే నిద్ర మాత్రలు వేసుకున్నారని, ఆయనేమీ ఆత్మహత్యాయత్నం చేయలేదని తెలిపారు. మొత్తంమీద మనోరమ కుమారుడు ఈ తరహా చర్యకు పాల్పడటం కోలీవుడ్‌లో కలకలం రేపింది.