శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 23 జనవరి 2021 (15:56 IST)

ఆటో నుంచి బీఎండబ్ల్యూ వరకు.. తనకు తానే గిఫ్ట్ ఇచ్చుకున్న సిరాజ్!

ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న భారత జట్టులో ఓ సభ్యుడు మహ్మద్ సిరాజ్. హైదరాబాద్‌కు చెందిన ఈ కుర్రోడు... తండ్రిని కోల్పయిన దుఃఖంలోనూ మైదానంలో అమితంగా రాణించాడు. ఇపుడు ఈ సిరీస్ ముగిసిన తర్వాత స్వదేశానికి చేరుకున్నాడు. ఈయన తండ్రి ఓ ఆటో డ్రైవర్. అయితే, ఇపుడు మహ్మద్ సిరాజ్ ఏకంగా బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేశాడు. ఈ కారును తనకు తానే బహుమతిగా ఇచ్చుకున్నాడు. 
 
ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టులకు బ్యాకప్​ బౌలర్​గా ఎంపికైన సిరాజ్.. ఆ దేశంలో ఉండగానే తన తండ్రి మరణ వార్తను విన్నాడు. క్వారంటైన్​లో ఉన్న అతడిని స్వదేశానికి వెళ్లేందుకు బీసీసీఐ అనుమతించింది. తాను దేశం తరపున ఆడాలనేది తండ్రి కల అని, దానిని నెరవేర్చిన తర్వాతే ఇంటికి వెళ్తానని బోర్డుకు తేల్చి చెప్పాడు. దానిని నిజం చేస్తూ టెస్టు సిరీస్​ను భారత్​ గెలుచుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. అందరితో శెభాష్ అనిపించుకుంటున్నాడు.
 
తొలి టెస్టులో షమి గాయపడడం వల్లే సిరాజ్​కు జట్టులో చోటుదక్కింది. ఆ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న ఇతడు.. మెల్​బోర్న్​లో 5 వికెట్లు తీసి గెలుపులో సహాయపడ్డాడు. సిడ్నీ మ్యాచ్​లో ఆసీస్​ ప్రేక్షకుల నుంచి జాత్యాంహకార వ్యాఖ్యలు ఎదుర్కొన్నా సరే వాటిని తట్టుకుని నిలబడి, రెండు వికెట్లు తీశాడు. 
 
నిర్ణయాత్మక బ్రిస్బేన్​ టెస్టు తొలి ఇన్నింగ్స్​లో ఒక వికెట్​.. రెండో ఇన్నింగ్స్​లో ఐదు వికెట్లు పడగొట్టి భారత్​కు మరపురాని విజయాన్ని అందించాడు. పర్యటన ముగించుకుని స్వదేశానికి రాగానే నేరుగా తన తండ్రి సమాధి వద్దకు వెళ్లి భావోద్వేగానికి లోనయ్యాడు.
 
సిరాజ్​ తండ్రి హైదరాబాద్​లో ఓ ఆటో డ్రైవర్​. తన కొడుకు తనలా కాకుండా గొప్పగా బతకాలని ఆయన కలలు కన్నారు. సిరాజ్​ క్రికెట్​లో రాణించేందుకు ఆయన అహర్నిశలు శ్రమించారు. ఆసీస్ పర్యటనతో ఆయన కల నిజమైంది. 
 
ఇప్పుడు బీఎమ్​డబ్ల్యూ కారు కొన్న సిరాజ్.. దానిని తనకు కానుకగా ఇచ్చుకున్నాడు. ఆటోవాలా కుమారుడి స్థాయి నుంచి బీఎమ్​డబ్ల్యూ యజమాని వరకు సాగిన సిరాజ్ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. నెటజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.